'ఏపీలో కొత్త రాజకీయ శకం, ముఖ్యమంత్రిగా జగన్, ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన అంశంపై సమాధానం చెప్పాలని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఈ రాజీనామాలు బీజేపీతో లాలూచీలో భాగంగా చేసినవే అన్నారు.
ఎంపీలు రాజీనామాలు చేసినా ఆ స్థానాలలో ఉప ఎన్నికలు రావడం లేదని ఎన్నికల సంఘం తేల్చిందన్నారు. ఆ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల నుంచి ఎందుకు తప్పించుకున్నారనే అంశాలన్నింటికీ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబు, లోకేష్లకు అవార్డులు వస్తున్నాయి
ప్రపంచ దేశాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్లకు అవార్డులు వస్తున్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఎన్నికల తర్వాత ఓడిపోయాక దేశం విడిచి పారిపోతారని, వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవాలని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి స్పందించారు.

నిరూపిస్తారా? అవినీతిని నిరూపిస్తారా?
చంద్రబాబును బోనెక్కించాలని ముద్దాయిలే అపహాస్యం చేయడం విడ్డూరంగా ఉందని పత్తిపాటి అన్నారు. అయిదు లక్షల కోట్ల వినీతి అనడానికి నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. పాస్పోర్ట్ ఏ విధంగా రద్దు చేయిస్తారో చెప్పాలని నిలదీశారు. విపక్షాలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదన్నారు.

జగన్, పవన్లు ఎందుకు ప్రశ్నించడం లేదు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తూ ఏపీకి ఇవ్వడం లేదని, దీనిపై ప్రధాని మోడిని పవన్ కళ్యాణ్, వైయస్ జగన్లు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. వారు ముగ్గురు ఒక్కటై టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయిదు లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు ఎందుకు రాలేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వైసీపీ ఎంపీల తర్వాత రాజీనామా చేసిన మూడు స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయని చెప్పారు. వైసీపీ స్థానాలకు ఉప ఎన్నికలు రాకపోవడంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందనే భయంతోనే కుట్ర పన్నారని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం ఏపీపై రాజకీయంగానే కాదని, ఆర్థిక పరమైన కుట్రలు కూడా చేస్తోందని ఆరోపించారు. చట్టాలను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.

సీఎంగా జగన్, ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ శకం ప్రారంభమైందని నటుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ అన్నారు. రాష్ట్రంలో యువనేతల పాలన రాబోతుందన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం నవ్యాంధ్రలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్, ప్రతిపక్ష నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications