మోడీ నినాదానికి సాయిరెడ్డి మద్దతు-ప్రజలకు కీలక పిలుపు..!
ఒకప్పుడు వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వంలో ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా, ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ ఛార్జ్ గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి .. ఆ తర్వాత పార్టీ ఓటమి పాలయ్యాక సైలెంట్ అయిపోయారు. చివరికి రాజకీయాలకూ, వైసీపీకి, ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా మద్యం స్కాంలో తొలుత సాక్షిగా, ఆ తర్వాత నిందితుడిగా మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు సామాజిక అంశాలపై ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.
ఇప్పుడు భారత్ పై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలపై ట్వీట్లు పెడుతున్న సాయిరెడ్డి.. ఈ విషయంలో ప్రధాని మోడీకి సైతం పలు సూచనలు చేస్తున్నారు. ట్రంప్ సుంకాల బాదుడుకు కౌంటర్ గా ప్రధాని మోడీ పిలుపు ఇస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కూడా ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి ప్రజలు కూడా అండగా నిలవాలని కోరుతూ ఇవాళ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.

పండుగ సీజన్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపును ఆచరణలోకి తీసుకుని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుందామని విజయసాయిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మన వ్యాపారవేత్తలకు, చేతివృత్తులవారికి , తయారీదారులకు మద్దతు ఇద్దామని తెలిపారు. అలాగే దేశీయ పరిశ్రమను బలోపేతం చేద్దామన్నారు. ప్రతి కొనుగోలు మన స్వావలంబన , మన ఆర్థిక వ్యవస్థను సాధికారపరచడం వైపు ఒక అడుగుగా సాయిరెడ్డి అభివర్ణించారు.

As we enter the festive season, let us turn Hon’ble PM @narendramodi ji’s call into action and choose Made in India products, support our entrepreneurs, artisans & manufacturers, and strengthen domestic industry. Every purchase is a step towards self-reliance & empowering our…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 26, 2025
ఇప్పటికే ట్రంప్ సుంకాల మోతకు విరుగుడుగా మేక్ ఇన్ ఇండియా ను కేంద్రం భారీ ఎత్తున ప్రమోట్ చేస్తోంది. ఇవాళ కూడా ప్రధాని మోడీ మారుతీ సుజుకీ ఈ-విటారా కారును ప్రారంభించడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కూడా మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా ప్రజలు అండగా నిలవాలని పిలుపునివ్వడం విశేషం.












Click it and Unblock the Notifications