చంటి.. ఏంటీ పని : మహిళతో అసభ్యంగా బెజవాడ కార్పోరేటర్
అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనుకునే నేతలు చాలామందే ఉంటారు. సభ్యతా సంస్కారాలు మరిచిపోయి మరీ తమ పైత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఇలాగే ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యారు విజయవాడ టీడీపీ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు.
సదరు నేతపై గతంలోను ఇలాంటి మరకలున్నాయి. కొద్దిరోజుల క్రితమే పుణే రైల్వే స్టేషన్ లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తూ నలుగురు టీడీపీ కార్పోరేటర్లు అక్కడి పోలీసుల చేతికి చిక్కారు. అందులో విజయవాడ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటి కూడా ఉండడం గమనార్హం.
ఇక తాజా ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..! ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరం బయలుదేరిన కార్పోరేటర్ చంటి.. విమానంలో తన తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విమానంలోనే చంటికి ఛీవాట్లు పెట్టిన ఆ మహిళ విమాన సిబ్బందిగా ఫిర్యాదు చేయగా..! సిబ్బంధి పెద్దగా స్పందించకపోవడంతో శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చంటిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా గన్నవరం పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. రంగంలోకి దిగిన ఓ టీడీపీ ఎంపీ చంటిని చిక్కుల్లో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనపై చర్యల విషయం అనుమానంగానే మారింది.
ఇకపోతే.. మహిళ పెట్టిన కేసు పట్ల స్పందించిన కార్పోరేటర్ చంటి తనకేం తెలియదని, ఇదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. విమానంలో పొరపాటున కాలో, చెయ్యో తగిలి ఉండొచ్చని అంతే తప్ప తాను మహిళతో అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. మరోవైపు ఆ మహిళ మాత్రం చంటిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఏదేమైనా.. టీడీపీ కార్పోరేటర్ల ప్రవర్తన యెల్లో.. యెల్లో.. డర్టీ ఫెల్లోగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ వాసులు. చంటి చేసిన పనికి అటు టీడీపీ పరువుతో పాటు, ఇటు విజయవాడకు కూడా మచ్చ తెచ్చే వ్యవహారంలా మారింది.