అమరావతి అతలాకుతలం: కరకట్ట రోడ్డు బంద్- ఏపీ హైకోర్టుకు సెలవులు?
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

ప్రకాశం బ్యారేజీకి వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించింది. రాత్రికి దీని తీవ్రత 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లుగా విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
ఈ వర్షాలు, వరదల ధాటికి రోడ్లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. రాజధాని అమరావతి పరిధిలో దాదాపుగా అన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. వరద నీళ్లు ఇప్పటికీ రోడ్లపై నిలిచే ఉన్నాయి. తుళ్లూరు, మందడం, వెంకటాయపాలెం, వెలగపూడి వంటి అమరావతిలోని అనేక గ్రామాలకు వెళ్లే వీలు ఉండట్లేదు.
కరకట్ట రోడ్డు మొత్తం దెబ్బతిన్నది. ఏపీ హైకోర్టు, సచివాలయానికి వెళ్లే మార్గాలన్నీ వరదనీటితో కోతకు గురయ్యాయి. చాలాచోట్ల కోసుకుపోయాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద వరద ప్రవాహానికి గులకరాళ్లు రోడ్డుపై తేలాయి. తారు మొత్తం కొట్టుకుపోయింది. అనేక చోట్ల గుంతలు పడ్డాయి.
ఈ పరిస్థితుల మధ్య ఈ మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయడానికి పూనుకుంది గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం. రోడ్లు వేయడం, కరకట్ట మరమ్మతు పనులను మొదలుపెట్టబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు కరకట్ట మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో- ఏపీ హైకోర్టుకు రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆమె రిజిస్ట్రార్కు లేఖ రాశారు. రోడ్డు నిర్మాణం, కరకట్ట మరమ్మతుల వల్ల హైకోర్టుకు వెళ్లే మార్గాలను మూసివేయాల్సి ఉందని వివరించారు.












Click it and Unblock the Notifications