రాధాను చంద్రబాబు ఫిక్స్ చేసేసారా : ఉమా కు చెక్ పెట్టేలా- హీటెక్కుతున్న బెజవాడ రాజకీయం..!!
కొద్ది రోజుల క్రితం వరకూ వంగవీటి రాధా చుట్టూ రాజకీయం తిరిగింది. తన పైన రెక్కీ ప్రయత్నం జరిగిందంటూ రాధా చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా కలకలం మొదలైంది. ఆ వెంటనే సీఎం ఆదేశాల మేరకు టు ప్లస్ టు గన్ మెన్లను ఏర్పాటు చేసారు. వైసీపీలోకి తీసుకెళ్లేందుకు జిల్లా మంత్రి కొడాలి నానితో పాటుగా రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రయత్నాలు చేసారు. ముగ్గురూ మిత్రులు కావటంతో.. చివరి వరకూ మంతనాలు సాగాయి. కానీ, అనూహ్యంగా చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు.
చంద్రబాబు నేరుగా రాధా నివాసానికి వెళ్లటంతోనే
నేరుగా వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు. పరామర్శించారు. వంగవీటి రాధాకు మద్దతుగా డీజీపీకి లేఖ రాసారు. ఆ సమయంలో రాధా కు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తో పాటుగా భవిష్యత్ లో మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో..అసలు రాధా వైసీపీ వైపు చూడకుండా ఉండేందుకు చంద్రబాబు ఫిక్స్ చేసేసారు. అందు కోసం రాధా భవిష్యత్ కు కీలక హామీ ఇచ్చినట్లుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి సెంట్రల్ సీటు మార్పు ..మచిలీపట్నం ఎంపీ సీటు ఆఫర్ తోనే ఆయన పార్టీ వీడటానికి తొలి అడుగు పడింది.
రాధాకు హామీ ఇచ్చారంటూ ప్రచారం
అయితే, టీడీపీ నుంచి సెంట్రల్ సీటు ఇస్తారని చంద్రబాబు చెప్పినట్లుగా బెజవాడ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సీటు నుంచి పార్టీ సీనియర్ నేత బోండా ఉమ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. 2014 నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో సీటు కోల్పోయారు. ఇక, విజయవాడ పార్లమెంటరీ పరిధిలో సీట్లు ...రాజకీయ నిర్ణయాలు పూర్తిగా ఎంపీ కేశినేని ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్ణయాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే.. వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన మరుసటి రోజునే ఎంపీ కేశినేని నాని సైతం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటు బోండా ఉమా మద్దతు దారుల్లో మాత్రం రాధాకు చంద్రబాబు నుంచి అటువంటి హామీలు ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.
బోండా ఉమా ఏం చేస్తారు
వంగవీటి రాధా సెంట్రల్ లో యాక్టివ్ అయితే.. బోండా ఉమా ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ సమయంలోనే బొండా ఉమా మంత్రి పదవి ఆశించారు. కానీ, ఉమాకు దక్కకపోవటంతో ఆయన అప్పట్లోనే అలకబూనిననట్లుగా వార్తలు వచ్చాయి. గతంలో కాకినాడలో జరిగిన టీడీపీ కాపునేతల సమావేశంలోనూ బోండా ఉమా పాల్లొన్నారు. రాష్ట్రంలో కాపు ముఖ్య నేతలు పార్టీలకు అతీతంగా సమావేశం అవుతూ... రాజకీయ ప్రాధాన్యత గురించి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
హీటెక్కుతున్న బెజవాడ రాజకీయం
ఇటువంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా ద్వారా కాపు వర్గంలో విజయవాడ - క్రిష్ణా జిల్లాల్లోనే కాకుండా పొరుగు జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందనేది టీడీపీ ముఖ్య నేతల అంచనా. దీంతో..రాధాను వదులుకోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఇక, ఇప్పుడు రాధాకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సెంట్రల్ సీటు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే..ఉమా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.