చంద్రబాబు భారీ ట్విస్టు- నేరుగా రాధా ఇంటికి : దోషులను రక్షించే ప్రయత్నాలు..!!
కొత్త సంవత్సరం నాడు..టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కొత్త ట్విస్టు ఇచ్చారు. బెజవాడ కేంద్రంగా ..వంగవీటి రాధా చుట్టూ తిరుగుతున్న రాజకీయాలను చంద్రబాబు ఇప్పుడు కొత్త మలుపు తిప్పారు. తాజాగా, వంగవీటి రాధా తనను పొట్టన పెట్టుకొనేందుకు రెక్కీ జరిగిందంటూ వ్యాఖ్యలు చేయటంతో ఒక్క సారిగా బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి కొడాలి నాని.. వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఆ వ్యాఖ్యలు చేసారు. దీంతో..మంత్రి కొడాలి నాని నేరుగా సీఎం జగన్ తో చర్చించటం ద్వారా రాధాకు టు ప్లస్ టు గన్ మెన్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
స్వయంగా రాధా ఇంటికి వెళ్లటం ద్వారా
పోలీసు అధికారులు గన్ మెన్లను కేటాయించగా.. రాధా వారిని తిరస్కరించారు. అయితే, రాధా భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని... ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. అదే సమయంలో రాధా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకు ఫోన్ చేసి పరామర్శించారు. డీజీపీకి లేఖ రాసారు. వెంటనే రాధాకు భద్రత కల్పించాలని.. ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.

పార్టీ అండగా ఉంటుందంటూ హామీ
ఇక, ఇప్పుడు నేరుగా రాధా ఇంటికి చంద్రబాబు వెళ్లారు. రాధా తో పాటు తల్లి రత్నకుమారి తో మాట్లాడిన చంద్రబాబు ..ఘటన..వ్యాఖ్యల పైన ఆరా తీసారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని..గన్ మెన్లను తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ అండగా ఉంటుందని రాధా కు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాధా తన పైన రెక్కీ జరిగిందని చెప్పి వారం పూర్తయినా..ఇంకా వాస్తవాలు ఎందుకు బయట పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టాలని...ప్రతీ చోట సీసీ కెమేరా ఫుటేజ్ ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు బయట ప్రచారంలో ఉన్నాయన్నారు. కారు తిరిగినట్లుగా చెబుతున్నారని.. ఆ కారు ఎవరిదో ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు.
3

తన లేఖే ఫిర్యాదుగా తీసుకోవాలంటూ
రాధా ఫిర్యాదు ఇవ్వలేదని అధికారులు చెప్పటం ఏంటంటూ..తాను ప్రతిపక్ష పార్టీ నేతగా నేరుగా డీజీపీకి లేఖ రాస్తే..ఇక ఫిర్యాదు లేదని చెప్పటం ఏంటని నిలదీసారు. దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాజకీయంగా రాధాను తమ పార్టీలోకి తీసుకెళ్లేందుకు కొడాలి నాని - వల్లభనేని వంశీ చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన చంద్రబాబు.. ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేసే క్రమంలో నేరుగా రాధా ఇంటికి వెళ్లి..కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు వేసిన రాజకీయ అడుగు బెజవాడ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొనే అవకాశం ఉందనే చర్చలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications