తెలంగాణ-ఏపీ: దేవుడికి వెండి కిరీటాలు చేయించిన బిచ్చగాడు
నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి(75) అనే యాచకుడు తాను భిక్షమెత్తుకునే ఆలయంలోని దేవుడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు.
విజయవాడ: అతనో యాచకుడు. తెల్లారిస్తే లేస్తే.. ఆలయం వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తుంటాడు. అయితే, అందరిలా కాదు ఈ భిక్షగాడు. ఏకంగా తాను ఏ గుడి ముందు అయితే భిక్షం ఎత్తుకుంటాడో ఆ గుడిలోని దేవుడికి వెండి కిరీటాలు చేయించి తన భక్తిని, ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతేకాదు, తనకు వచ్చిన మొత్తంలో కొంత నిత్యాన్నదాన కార్యక్రమానికి కూడా ఆయన విరాళంగా ఇవ్వడం గమనార్హం. ఆ యాచకుడే తెలంగాణ ప్రాంతానికి చెందిన యాదిరెడ్డి.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి(75).. 11ఏళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వెళ్లాడు. యవ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు విజయవాడలోనే గడిపాడు. 45 సంవత్సరాలు రిక్షా తొక్కుతూ, ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు. వృద్ధాప్యంలో పని చేయడం చేతకాకపోవడంతో విజయవాడలోని వీధుల్లో, కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు.
యాదిరెడ్డి వివాహం చేసుకోకపోవడంతో భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఖర్చులకు పోనూ.. మిగిలిన నగదును ఆధ్యాత్మికం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోదండరాముడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. వాటికి రూ. లక్షా50వేలు ఖర్చు అయింది. అంతే గాకుండా రూ. 20 వేలను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు.
గతంలో సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు యాదిరెడ్డి. ఈవిషయాలపై యాదిరెడ్డిని ప్రశ్నిస్తే.. దేవుడే తనకు గొప్ప శక్తి, ధైర్యం అని చెప్పుకొచ్చాడు. దేవుడి దయ వల్లే ఇంతకాలం జీవించగలిగానని భావోద్వేగానికి లోనయ్యారు. అందుకే తన శక్తిసామర్థ్యాల మేరకు దేవుడికి ఈ చిన్న కానుకలు ఇచ్చానని తెలిపారు.