విశాఖ ఉక్కు ఉద్యమం.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు వైసీపీ మద్దతు; పార్లమెంట్ లోనూ సమరమే : సాయిరెడ్డి క్లారిటీ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంటు సమావేశాల్లో ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తున్న నేపథ్యంలో, చాలా రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా మరోమారు కేంద్రం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసి ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ క్రమంలో విజయ సాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ వేదికగా విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తాం : విజయసాయి రెడ్డి
ఆగస్టులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే కార్మికుల నిరసనలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో అవంతి శ్రీనివాస్ తో కలిసి భేటీ అయిన విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రివేతీకరం నిర్ణయానికి తాము వ్యతిరేకం అన్న సాయి రెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం సరికాదని, నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం మంచిది కాదన్న విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీ గా మార్చాలని పేర్కొన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైనింగ్ ను కేటాయిస్తే తక్కువ ధరకు ముడిసరుకు లభిస్తుందని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. మొదటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న ఆయన లోక్సభ ,రాజ్యసభలో స్టీల్ ప్లాంట్ కోసం గళం వినిపించేలా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు .
జాతి సంపదను ప్రైవేట్ పరం చెయ్యటం మంచిది కాదన్న మంత్రి అవంతి శ్రీనివాస్
కేంద్ర ఆర్థిక మంత్రి తోనూ, ఉక్కు శాఖ మంత్రితోనూ కలిసి మాట్లాడతామని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్ పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం పై ఒత్తిడి తేవడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు పనిచేస్తారని స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు మద్దతివ్వాలని కార్మికులు కోరగా, తప్పనిసరిగా మద్దతిస్తామని మంత్రి కార్మికులకు హామీ ఇచ్చారు. జాతి సంపదను ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని కార్మికులకు స్పష్టం చేశారు. మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కార్మికుల పక్షానే ఉందని స్పష్టం చేశారు.