విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై బిగ్ అలర్ట్..!!
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే నంబర్ 20833 నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయింది. నాలుగు గంటల పాటు ఆలస్యంగా ప్రయాణిస్తోంది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ సర్వీస్ను రైల్వే అధికారులు రీ షెడ్యూల్ చేశారు. విశాఖపట్నం నుంచి తెల్లవారు జామున 5:45 నిమిషాలకు బదులుగా ఉదయం 10 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్కు బయలుదేరింది.
విశాఖపట్నం నుంచి బయలుదేరడానికి ముందు సీ 9 కోచ్లో సాంకేతికత లోపం తలెత్తింది. దీన్ని గుర్తించిన అధికారులు దాన్ని సరి చేశారు. దీనికి నాలుగు గంటల సమయం పట్టింది. ఫలితంగా ఈ రైలు సమయాన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2:25 నిమిషాలకు ఈ రైలు సికింద్రాబాద్ చేరాల్సి ఉండగా.. 6:15 నిమిషాలకు వస్తుంది.
నిర్ణీత సమయంలో ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు ఆలస్యంగా బయలుదేరుతుంది.












Click it and Unblock the Notifications