మరో టీడీపీ కీలక నేతపై కేసు నమోదు: సీఎంను దూషించారని: వేధిస్తున్నారంటూ..!
టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఒకరి తరువాత మరొకరు కేసుల బారిన పడుతున్నారు. మాజీ విప్ లు కూన రవికుమార్ పైన నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూర్ చేయటం తో ఆయన అనేక రోజుల తరువాత ఆయన బయటకు వచ్చారు. అదే విధంగా మరో విప్ చింతమనేని ప్రభాకర్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఇక..యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదించింది.
ఛలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే కారణంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పైన కేసు రిజిస్టర్ అయింది. ఇక, ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి మీద కేసుల నమోదు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ను దూషించారని..కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీద ఫిర్యాదు దాఖలైంది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.

జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ పైన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసారు. జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని వ్యాఖ్యానించారు. పులివెందుల రౌడీలను విశాఖకు పంపి అక్కడ శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్నారని ఆరోపించారు. దీంతో..అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
తన జన్మదినం నాడు మాజీ మంత్రి లోకేశ్ నర్సీపట్నం పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ర్యాలీ ఏర్పాటు చేసారు. దానిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనూ పోలీసుల మీద అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక, పార్టీ సమావేశాల్లోనూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణం అవుతున్నాయి. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం లో పార్టీ ఓటమి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంత చేసినా ఓడిపోవటం పైన కన్నీరు పెట్టుకున్నారు.
కేసుల్లో వరుసగా టీడీపీ నేతలు
ఇక, టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత అనేక మంది టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ అధికారుపైన వ్యవహరించిన తీరు పై మాజీ విప్ కూన రవి కుమార్ మీద కేసు నెమోదైంది. ఆయన మందస్తు బెయిల్ కోసం అనేక రోజులుగా ప్రయత్నాలు చేస్తూ..చివరకు సాధించారు. అప్పటి వరకు అరెస్ట్ తప్పించకొనేందుకు వేరే ప్రాంతంలో ఉన్నారు. అదే విధంగా మరో విప్ చింతమనేని పైన అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. పల్నాడులో టీడీపీ కీలక నేత యరపతినేని శ్రీనివాస రావుపైన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మైనింగ్ విషయంలో సీబీఐ విచారణకు కేంద్రానికి సిఫార్సు చేసింది.
ఇక, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మీద కూడా భూ వివాదం ఆధారంగా కేసు నమోదు చేసారు. చలో ఆత్మకూరు సందర్భంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించారని...అదే విధంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా పోలీసు అధికారిని దూషించారంటూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీద కేసు రిజిస్టర్ అయింది. ఇలా..ఒకరి తరువాత మరొకరు టీడీపీ నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అయితే, టీడీపీ నాయకులు మాత్రం తమ వారిని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications