వైఎస్ వివేకా హత్య సినిమా 'వివేకం' సంచలన రికార్డ్!
ఐదు సంవత్సరాల నుంచి ఏపీని కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉందా? అంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అని చెప్పొచ్చు. ఆ హత్యను ఇతివృత్తంగా తీసుకొని వివేకం పేరుతో సినిమా రూపుదిద్దుకుంది. థియేటర్లలో విడుదలవలేదుకానీ కేవలం యూట్యూబ్ ఛానళ్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఈనెల 12వ తేదీ నాటికి 2.15 కోట్ల వ్యూయర్ షిప్ రికార్డును దక్కించుకుంది. యూట్యూబ్ చరిత్రలో ఒక రికార్డుగా నమోదైంది. చివరి నాలుగు రోజుల్లో ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
సునీత పోరాటం
రాజకీయ ఆధిపత్యం కోసం వైఎస్ వివేకాను హత్య చేశారనే ప్రచారం నడుస్తోంది. సీబీఐ కూడా దాన్నే ధ్రువీకరించింది. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్యకు సంబంధించి దోషులకు శిక్ష పడాలని అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కడప వైసీపీ ఎంపీగా పోటీచేస్తున్న అవినాష్ రెడ్డిని గెలిపించవద్దని, కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన తండ్రిని ఎవరు, ఎలా హత్యచేశారు? ఎవరిపై అనుమానం ఉంది? ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు? తదితర విషయాలను పూసగుచ్చినట్లు చెబుతున్నారు.

ఎన్నికలపై ప్రభావం?
వివేకా హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని వైఎస్ షర్మిల ఊరూ వాడా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అంటూ ఆరోపిస్తున్నారు. విపక్షాలకు సైతం వివేకా హత్య ప్రచార అస్త్రంగా మారింది. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులోని అంశాలను ఆధారంగా చేసుకొని వివేకం సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా 55 యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రదర్శితమవుతోంది. వ్యూయర్ షిప్ చాలా ఎక్కువగా వస్తోంది. వైఎస్ కుటుంబంలో ఏ చిన్న వార్త అయినా ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారిపోయింది. ఎన్నికల్లో వివేకం సినిమా ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications