వైజాగ్ లో బుల్ డోజర్ పాలిటిక్స్- వైసీపీ వర్సెస్ టీడీపీ- అయ్యన్నపాత్రుడు టార్గెట్ తో మరోసారి..
ఏపీలో కార్యనిర్వాహక రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విశాఖ జిల్లాలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ఇళ్లపై వైసీపీ సర్కార్ చేయిస్తున్న దాడులు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. తాజాగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై వైసీపీ సర్కార్ బుల్ డోజర్లు పంపడాన్ని బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో కక్షారాజకీయాలు ఏ స్ధాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చు.
విశాఖ రాజకీయం
ఏపీలో అత్యంత రాజకీయం చైతన్యం కలిగిన జిల్లాల్లో ఒకటైన విశాఖలో ఇప్పుడు రాజకీయ రచ్చ సాగుతోంది. ముఖ్యంగా విశాఖను మూడో రాజధానుల్లో ప్రధానంగా చేయాలని భావిస్తున్నవైసీపీ అందుకు తగినట్లుగానే ఇక్కడ పావులు కదుపుతోంది. కానీ ఇక్కడ కాకలు తీరిన టీడీపీ నేతల నుంచి వారికి ప్రతిఘటన ఎదురవుతోంది.
దీంతో సహజంగానే అందుకు కారకులైన నేతలపై వైసీపీ టార్గెట్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే విశాఖలో కీలకమైన టీడీపీ నేతలు సబ్బంహరి, గంటా శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు వంటివారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం..తాజాగా మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేసి సంకేతాలు పంపింది.
టీడీపీ టార్గెట్ గా కక్షా రాజకీయం
రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంటుందని భావించే విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాలపై పట్టు కోసం వైసీపీ పావులు కదుపుతోంది.ఇందులో భాగంగా విశాఖలో దక్షిణ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఆ పార్టీకి దూరం చేసిన వైసీపీ.. ఆ తర్వాత గంటాను లాగేందుకు ప్రయత్నించి విఫలమైంది.
ఆ తర్వాత వైజాగ్ స్టీల్ కోసం దీక్ష చేసిన పల్లా శ్రీనివాసరావును టార్గెట్ చేసింది. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేసి ఇంటి కూల్చివేతకు దిగింది. తద్వారా వరుసగా టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. దీంతో ఈ కక్షా రాజకీయాలపై ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.
ముందస్తు జోరుగా మరింతగా..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్నాయి. అదే సమయంలో విశాఖను రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకురాలేకపోయింది. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో దృష్టిమరల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ నేతల్ని ఈ స్దాయిలో టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ దాడులు, కూల్చివేతలు మరింతగా పెరుగుతాయని ఆంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు స్ధానికసంస్ధల్లోనూ బలంగా ఉన్న వైసీపీ.. అదే అదనుగా టీడీపీని ఉత్తరాంద్ర నుంచి తుడిచిపెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.