జగన్కు మరో తలనొప్పి-సొంత జిల్లాలో టిప్పుసుల్తాన్పై రచ్చరచ్చ- వైసీపీ, బీజేపీ సవాళ్లు
ఏపీలో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పుసుల్తాన్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ నేతలు, స్ధానిక ముస్లింలు ప్రయత్నిస్తుండగా.. దీన్నిఅడ్డుకునేందుకు బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిన్న విగ్రహ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇవాళ అదే పార్టీకి చెందిన విష్ణువర్ధన్రెడ్డి ఏకంగా విగ్రహం సందర్శిస్తామంటూ బయలుదేరారు. చివరి నిమిషంలో పోలీసులు అడ్డుకున్నా విగ్రహం కూల్చేస్తామంటూ ఆయన చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
సీమలో టిప్పుసుల్తాన్ రచ్చ
ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన రాజుల్లో ఒకరైన టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేందుకు స్ధానిక ముస్లింలు, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి సాయంతో ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే విగ్రహ ఏర్పాటు కోసం శంఖుస్ధాపన చేశారు. త్వరలో విగ్రహ నిర్మాణం ప్రారఁభం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. చరిత్రలో హిందువులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్ విగ్రహం ప్రొద్దుటూరులో ఎలా ఏర్పాటు చేస్తారంటూ హెచ్చరికలకు దిగుతున్నారు.
బీజేపీ ఛలో ప్రొద్దుటూరు విఫలం
ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న జిన్నా రోడ్కు వెళ్లే్ందుకు బీజేపీ నేతలు ఇవాళ ప్రయత్నించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి మరికొందరు పార్టీ నేతలతో కలిసి ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. అయితే పోలీసులు ఆయన్ను విగ్రహం ఏర్పాటు స్ధలం వద్దకు పంపేందుకు నిరాకరించారు. దీంతో కాసేపు స్ధానిక నేతలతో సమావేశమై విష్ణు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టి టిప్పుసుల్తాన్పై, వైసీపీ నేతలపై విష్ణు రెచ్చిపోయారు.
టిప్పుసుల్తాన్ విగ్రహం కూల్చేస్తాం
ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము తప్పకుండా కూల్చేస్తామని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి హెచ్చరించారు. టిప్పుసుల్తాన్ విగ్రహంతోనే మీ పతనం మొదలవుతుందంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి రేపు అఫ్జల్ గురు విగ్రహం పెట్టేందుకు కూడా సిద్దమవుతారంటూ ఆక్షేపించారు. వైసీపీ సర్కార్కు టిప్పుసుల్తాన్, కసబ్, అప్ఘల్ గురు వంటి వారు దేశభక్తుల్లా కనిపిస్తున్నారని విష్ణు విమర్శించారు. వీరి చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రొద్దుటూరులో ఎలాంటి అనుమతుల్లేకుండా టిప్పుసుల్తాన్ విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు. జిన్నారోడ్డు సర్కిల్లో చరిత్రపై చర్చకు ఎమ్మెల్యే రాచమల్లు సిద్దమా అని విష్ణు ప్రశ్నించారు. జిన్నారోడ్డు వద్ద జిన్నా పేరు తొలగించాలని డిమాండ్ చేశారు.టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు వెనుక తప్పకుండా ఓ కుట్ర కోణం ఉందన్నారు.
టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడే
టిప్పుసుల్తాన్ విగ్రహం విషయంలో బీజేపీ వైఖరిని స్ధానిక ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి తప్పుబట్టారు. టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడేనని, జాతీయవాదంతో టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. బ్రిటిష్ చరిత్ర కారులు రాసిన చరిత్ర చదివి రాద్ధాంతం చేయొద్దని బీజేపీ నేతలకు రాచమల్లు సూచించారు. ప్రొద్దుటూరు ప్రజలు టిప్పుసుల్తాన్ గురించి తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు మతసామరస్యానికి భంగం కలిగించవద్దని ఎమ్మెల్యే సూచించారు. శాస్త్ర్రీయ ఆధారాలు ఉంటే బీజేపీ నేతలు నిరూపించాలని, తాను అంత మేథావిని కాదని, ప్రొద్దుటూరులో మేథావులతో చర్చ పెట్టి టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడు కాదని నిరూపిస్తే ఒప్పుకుంటానని తెలిపారు.