నోర్ముయ్.. నువ్వేంటి.. నీ స్థాయేంటి..? : లైవ్ డిబేట్లో టీడీపీ,వైసీపీ నేతల వాగ్వాదం
ఏపీ రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్న అధికార,ప్రతిపక్షాలు టీవి చానెళ్ల చర్చా కార్యక్రమాల్లోనూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా రాజధాని అంశంపై ఓ టీవి చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, టీడీపీ నేత అనురాధ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
మొదట చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ ఊసరవెల్లి అంటూ సంబోధించడాన్ని ప్రస్తావిస్తూ అనురాధ మాట్లాడారు. గూగుల్ సెర్చ్లో ఊసరవెల్లి అని సెర్చ్ చేస్తే ఎవరి పేరు రాదని, కానీ ఖైదీ నంబర్ 6093 లేదా ఆంధ్రా 420 అని సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందని విమర్శించారు.
అనురాధ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయనపై కూడా ఆరోపణలు చేశారు. మీ బార్లో ఏడుగురు చనిపోయారని అనురాధ వ్యాఖ్యానించడంతో.. మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నోర్ముయ్.. నువ్వేంటి..? నీ స్థాయేంటి..? అని మండిపడ్డారు. టీవి చానెల్లో కూర్చొని పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దన్నారు. నీ సంగతి చూడటం పెద్ద విషయమేమీ కాదని హెచ్చరించారు.
ఆడదానివని కూడా చూడనని,నాలుక కట్ అయిపోద్దని హెచ్చరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని సూచించారు. అటు అనురాధ కూడా బ్రాహ్మణ సంఘాలతోనే నిన్ను 'ఛీ' కొట్టిస్తానంటూ విరుచుకుపడ్డారు. ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని సదరు హోస్ట్ సూచించడంతో చివరకు గొడవ సద్దుమణిగింది.