ఎర్రబెల్లి వద్దేవద్దు: నేతల మొర, గాబరావద్దని కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావును పార్టీలో చేర్చుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా నేతలు విజ్ఞప్తి చేశారు. పలువురు నేతలు మంగళవారం కేసీఆర్ను కలిశారు.
ఎర్రబెల్లి చేరబోతున్నారనే వార్తల పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రబెల్లిని చేర్చుకోవద్దని, ఆయన చేరిక వల్ల ఉపయోగం ఉండదని పలువురు కేసీఆర్కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇన్నేళ్లుగా తమతో తీవ్రంగా విభేదించి, తెరాసను ఎదగనీయకుండా చేయాలని ప్రయత్నించిన ఎర్రబెల్లిని చేర్చుకోవడం సరికాదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పలువురు నేతలు మంగళవారం హైదరాబాదుకు వచ్చి ఓ చోట సమావేశమయ్యారు. వారు తమ అసంతృప్తిని సీనియర్ నేతల దృష్టికి తీసుకు వెళ్లారు. వారు కేసీఆర్ దృష్టికి ఇదే విషయాన్ని తీసుకు వెళ్లారు.
రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తప్పవని, తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని, ఇలాంటి సమయంలో వద్దనవద్దని, భవిష్యత్తులో ఇక్కడ టీడీపీకి ఉనికి లేకుండా చూసుకుందామని, వస్తామన్న వారు టీడీపీని వదిలి బయటకు వస్తే ఆలోచిద్దామని, పార్టీలో ఉన్నవారు గాబరాపడవద్దని సూచించారు.
కేసీఆర్తో మాట్లాడాక మరోమారు ముఖ్య నేతలు ఇతర నాయకులతో భేటీ అయ్యారు. ఎర్రబెల్లి ఎన్నికలకు ముందు కూడా చాలాసార్లు వస్తానని చెప్పి చివరి నిమిషంలో టీడీపీలోనే ఉన్నారని, ఆయన వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పారని తెలుస్తోంది. ఎర్రబెల్లి వంటి వారు వచ్చినా సీనియర్లకు అన్యాయం జరగదని నచ్చజెప్పే ప్రయత్నం ముఖ్యనేతలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications