హైద్రాబాద్పై ఆలోచించమన్నాం: చిరు, టి బిల్లుపై షిండే
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన పునరాలోచించాలని తాము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిరంజీవికి చెప్పినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం చెప్పారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, దగ్గుబాటి పురంధేశ్వరిలు చిద్దూను కలిశారు.
అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని తాము కోరినట్లు చెప్పారు. హైదరాబాదు గురించి ఆలోచించాలని కోరామన్నారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలను, ప్రజల ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఉద్యోగులు, విద్యార్థుల భయాలను తొలగించాలని కోరుతున్నామన్నారు.
తాను రాజీనామా చేసినందు వల్ల విధులకు దూరంగా ఉన్నానని చిరు చెప్పారు. హైదరాబాదు అభివృద్ధిలో తెలుగు వారందరి కృషి ఉందని చెప్పారు. గతంలో సమైక్యవాదం వినిపించి ఇప్పుడు న్యాయం అంటున్నారని ప్రశ్నించగా.. తాను అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయినా సమస్యలకు సమాధానం చెప్పాకే ముందుకు వెళ్లాలని మొదటి నుండి చెబుతున్నామన్నారు.
జివోఎం భేటీ
మరోవైపు విభజన అంశంపై వేసిన మంత్రుల బృందం(జివోఎం) గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో భేటీ అయింది. వచ్చిన నివేదికలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సమీక్షించారు. భేటీకి ముందు షిండే మాట్లాడుతూ... నెలాఖరులోగా మంత్రుల కమిటీ పని పూర్తి చేస్తుందని, తెలంగాణ బిల్లు సరైన సమయంలో అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ అంశాలను బిల్లులో పొందుపరుస్తామని ఆయన చెప్పారు.
భేటీలో టాస్క్ఫోర్స్ అధికారి విజయకుమార్ నివేదిక ఇచ్చారు. సమావేశం గంటపాటు సాగింది. భేటీ అనంతరం షిండే మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలు మరికొన్ని జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న మరోసారి భేటీ కానున్నట్లు చెప్పారు.