టికి ఒప్పుకున్నట్లే: దేవుడిపై జగన్ భారం, ఆఇద్దరిపై ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు అనుమతిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు.
సమాచారం ఇవ్వకుండా, తీర్మానం లేకుండా చర్చ ఎలా అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేస్తే తాము కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే అందరం నాశనమవుతామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం బడ్జెట్లో మూడో స్థానంలో ఉందని, విడిపోతే ఓ రాష్ట్రం తొమ్మిదో స్థానానికి, మరో రాష్ట్రం పద్నాలుగో స్థానానికి పోటీ పడుతాయన్నారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. తమకు బలం లేనందున, దేవుడి పైన భారం వేశామన్నారు.
ఏ రాష్ట్రమైతే కాంగ్రెసు పార్టీకి ప్రధానమంత్రి పీఠాన్ని కట్టబెట్టిందో అదే రాష్ట్రంతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. తీర్మానం అనే పదానికి అర్థం పర్థం లేకుండా చేశారన్నారు. తామంతా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చామన్నారు. తాజా మాజీలు కూడా తమతో వచ్చారన్నారు. ఎన్నికలు జరిగితే వారు గెలిస్తారనే ఉద్దేశ్యంతో వారిపై అనర్హత వేటు వేశారన్నారు. ఇతర పార్టీల నేతలు తాము చేసినట్లు అఫిడవిట్లు సమర్పించాలన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చామన్నారు. రాష్ట్ర సమైక్యతను కోరుకునే ఇతర పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రణబ్కు అఫిడవిట్లు ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశ్యంతోనే తన పార్టీ ఎమ్మెల్యేలతో అఫిడవిట్లు ఇప్పించడం లేదన్నారు.
చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఏం చెప్పినా ఆ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు మనస్సాక్షి చెప్పినట్లు ఓటు వేయాలన్నారు. విభజన విషయంలో చంద్రబాబులో ఇప్పటి వరకు మార్పు రాలేదన్నారు. సమైక్య లేఖ ఇవ్వాలని ఎపిఎన్జీవోలు కోరినా సమ్మతించలేదన్నారు. కిరణ్ ఇప్పటికీ సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. స్పీకర్ లక్నో, ఇతర రాష్ట్రాలలో ఎందుకు పర్యటిస్తున్నారని జగన్ ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఆమోదంతోనే విభజన జరిగిందన్నారు. విభజనకు సభ ఆమోదం తెలపాలన్నారు. కానీ ఇలా అడ్డగోలుగా విభజన చేయడం ఏమాత్రం సరికాదన్నారు. చంద్రబాబు, కిరణ్, సభాపతి నాదెండ్ల మనోహర్లు ఇప్పటికీ విభజనను అడ్డుకోకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. విభజన మీద చర్చ జరగాలంటున్న కిరణ్ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు అంగీకరించినట్లయితే విభజనకు అంగీకరించినట్లే అవుతుందన్నారు. విభజనకు సంబంధించి సమాచారం ఇవ్వకుండా, తీర్మానం లేకుండా ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే డ్రాఫ్ట్ బిల్లు పంపించారని, మన కళ్ల ముందే జరుగుతున్న కుట్రను అడ్డుకోవాలన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలన్నారు. విభజనకు అనుకూలంగా కాకుండా మూడు ప్రాంతాలకు అనుకూలంగా నాయకత్వం ఉండాలన్నారు.