వైఎస్ జగన్పై అసభ్య పదజాలం: రాష్ట్రపతికి ఆ పదానికి అర్థం వివరించిన వైసీపీ ఎంపీలు
అమరావతి: ఊహించిందే చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ పార్టీ నాయకులు దేశ రాజధానిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన అతి కొద్దిరోజుల్లోనే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో అదే తరహాలో పావులు కదిపారు. రాష్ట్రపతిని కలిశారు. తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను ఆయనకు అందించారు. టీడీపీ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతితో భేటీ..
రాష్ట్రపతిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, లోక్సభ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా మహేశ్వరరావు వంటి నాయకులు వైఎస్ జగన్పై చేసిన అసభ్య పదజాలాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు తాము అందించిన నాలుగు పేజీల లేఖలో ఆ పదాలను స్పష్టంగా పొందుపరిచారు. వాటికి అర్ధాలను కూడా వివరించారు.

కఠిన చర్యలు.. గుర్తింపు రద్దు
రాష్ట్రపతిని కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పట్టాభి సహా ఇతర టీడీపీ నాయకులు వైఎస్ జగన్పై చేసిన పదాల గురించి రామ్నాథ్ కోవింద్కు వివరించామని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకుడిపై అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీపై కఠిన చర్యలను తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని అన్నారు.

టెర్రరిస్ట్ పార్టీగా..
టీడీపీ కనీస విలువలను పాటించట్లేదని, ఆ పార్టీకి మనుగడలో ఉండే హక్కు లేదని సాయిరెడ్డి అన్నారు. అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో క్రమంగా టెర్రరిస్ట్ పార్టీగా మారుతోందని మండిపడ్డారు. అసాంఘిక పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు. 2019 నాటి ఎన్నికల సందర్భంగా కోట్లాదిమంది ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లను బెదిరిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిందని సాయిరెడ్డి విమర్శించారు.

మనుగడ సాగించే నైతిక హక్కు లేదు..
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ- దాన్ని జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించలేని ఏ పార్టీకి కూడా ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే హక్కు లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కొనసాగే నైతిక హక్కును టీడీపీ కోల్పోయిందని చెప్పారు. ఇదే విషయాన్ని తాము రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని, ముఖ్యమంత్రిపై టీడీపీ నాయకులు చేసిన అసభ్య పదాలకు అర్థాలను వివరించామని అన్నారు.

కంటెప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం కింద..
కంటెప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం 1971 లోబడి టీడీపీపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషించిన వారికి ఈ చట్టం ప్రకారం.. చర్యలు తీసుకోవాలని న్యాయ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని సాయిరెడ్డి వివరించారు. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని అన్నారు.












Click it and Unblock the Notifications