వేడుకున్నాం, రిజైన్స్పై రాష్ట్రపతిని కలుస్తాం: లగడపాటి
హైదరాబాద్/విజయవాడ: తమ రాజీనామాల ఆమోదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 వరకు రాష్ట్ర విభజనను ఆపడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ పదవులు సైతం వదులుకొని అధిష్టానంపై తిరగబడతామని లగడపాటి అన్నారు.
తమ రాజీనామాలను ఆమోదించుకునేందుకు మళ్లీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళితే సుప్రీం కోర్టులో కేసు వేస్తానని లగడపాటి కేంద్రాన్ని హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో విభజనకు అనుకూలంగా వ్యవహరించే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
రాష్ట్రం సమైక్యాంగా ఉండాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరూ ప్రయత్నిస్తున్నా కొన్ని పార్టీల చేతకాని తనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అటువంటి పార్టీలను బండకేసి కొట్టాలని లగడపాటి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వొద్దని ఆ పార్టీలను వేడుకున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణకు మద్దతుగా లేఖలిచ్చిన తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు స్వప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఇటీవల సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలను శుక్రవారం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందె.