టీ కప్పులో తుఫాను, పాత వ్యక్తులేనని సీఎం చెప్పారు: అఖిల- ఏవీ సుబ్బారెడ్డి కలిశారు!
అమరావతి: ఆళ్లగడ్డ పంచాయతీ ముగిసింది! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఇరువురు నేతలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. కలిసి పని చేసుకోవాలని మంత్రి భూమా అఖిలప్రియకు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి హితవు పలికారు. శుక్రవారం వారిద్దరితో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు.
Recommended Video
'భూమా' కేడర్ ఎక్కడిది: అఖిలప్రియ-మౌనికలకు సుబ్బారెడ్డి కూతురు గట్టి కౌంటర్
అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చంద్రబాబు రాజీ కుదిర్చారు. గొడవలు ఉంటే కలిసి మాట్లాడుకోవాలని హితవు పలికారు. పార్టీ కోసం పని చేయాలని సూచించారు. చంద్రబాబు వారితో విడివిడిగా, కలిసి మాట్లాడారని తెలుస్తోంది. భేటీ అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ గొడవ టీ కప్పులో తుఫాను
అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సమసిపోయాయని, కలిసి పని చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని వర్ల రామయ్య చెప్పారు. ఇద్దరు కలిసి పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. వారి మధ్య గొడవ టీ కప్పులో తుఫాను వంటిది అన్నారు. అది సమసిపోయిందన్నారు.
కలిసి ముందుకు సాగుతాం
చిన్న చిన్న విభేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారని అఖిలప్రియ చెప్పారు. విభేదాలు ఉంటే ఇరువురం చర్చించుకొని పరిష్కరించుకుంటామని తెలిపారు. అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామని, ఐకమత్యంతో ముందుకు సాగుతామన్నారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి బాధాకరమేనని, ఇప్పుడు కలిసి సాగుతామన్నారు.
పాత వ్యక్తులేనని చంద్రబాబు చెప్పారు
ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు రావాలని సీఎం తనకు సూచించారని, తనకు ఓ కూతురుగా చెప్పారని అఖిలప్రియ అన్నారు. ఓ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నట్లే పార్టీలోను ఉంటాయని, వీటిని పరిష్కరించుకుంటామని చెప్పారు. కలుపుకుపోయేది కొత్త వ్యక్తులను కాదని, పాత వ్యక్తులే అని, తన తల్లిదండ్రులతో కలిసి పని చేసిన వ్యక్తేనని చంద్రబాబు తనకు చెప్పారని అఖిల అన్నారు. అందరం కలిసి పని చేస్తామని అధినేతకు చెప్పామన్నారు.
నా వంతు కృషి చేస్తా
ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... పార్టీ కోసం పని చేయమని చంద్రబాబు సూచించారని, ఆయన చెప్పినట్లు వింటామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం భూమా కుటుంబానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
విడివిడిగా.. కలిపి మాట్లాడారు
కాగా, చంద్రబాబు నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కలిసి మాట్లాడారు. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియలతో విడిగా మాట్లాడారు. ఆ తర్వాత వారిద్దరిని ఓ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా మౌనికా రెడ్డిలతోను అధినేత మాట్లాడారు. అయితే చంద్రబాబు జోక్యంతో ప్రస్తుతానికి వివాదం ముగిసినట్లుగా కనిపించినా ఏవీ సుబ్బారెడ్డి ముక్తసరిగా మాట్లాడటం, అఖిలప్రియ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. కాగా, ఇరువురు నేతలు తమకు సంబంధించి సాక్ష్యాలు కూడా సీఎం ఎదుట పెట్టారు.