ఏపీలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ప్రభావం
అమరావతి: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నాటికి అల్పపీడనం బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

శనివారం విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం కూడా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కి.మీ వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications