బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రత- ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది. క్రమంగా ఇది ఏపీ దక్షిణ కోస్తా- తమిళనాడు ఉత్తర తీరం వైపు కదులుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 26వ తేదీ వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. క్రమంగా ఇది ఏపీ, తమిళనాడు తీరప్రాంతాల వైపు కదులుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.4 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయి.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
అలాగే- కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 26వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
అటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోనూ దీని ప్రభావం అధికంగా కనిపించవచ్చు. చెన్నై సహా ఉత్తర జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూర్, కడలూర్, విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురంలల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదు కావొచ్చు.












Click it and Unblock the Notifications