ఏం గమ్మత్తైన రాజకీయాలురా బాబు..! పోటీలో తండ్రి కూతుళ్లు, తల్లి కొడుకులు, భార్య భర్తలు.!దేవుడా.!!
అమరావతి/హైదరాబాద్ : ఎక్కడైనా ఆస్తులను మనం మన వారసులుగా అందిస్తాం. మనతో సమానంగా ఉండాలని కోరుకుంటాం. కాని ఎక్కడా మన వారసులను, మన వాళ్లను మనకు పోటీగా చూడం. అందులోనూ తండ్రీ కూతుర్లు, భార్యా భర్తలు, తల్లీ కొడుకుల మధ్య అసలు పోటీలుండవు. ఎందుకంటే ఒక తండ్రి తన కూతురు విజయం చూడలనుకుంటాడు. తల్లి పుత్రుడి కోరికను నేరవేర్చాలనుకుంటుంది. భార్య భర్తకు అండగా ఉండాలనుకుంటుంది. కాని భార్య, భర్త, తండ్రి, కూతురు పరస్పరం పోటీ పడటం చాలా అనుదైన విషయం. రాజకీయాలకు, రక్త సంబంధానికి ఎలాంటి సంబందం లేదని ప్రస్తుత రాజకీయాలు రుజువు చేస్తున్నాయి. ఏపిలో కుటుంబ సభ్యుల మద్య నెలకొన్న రసవత్తరపోటీ పైన ఓ లుక్కేద్దాం..!!

రసవత్తరమైన రాజకీయాలు..! కుటుంబసభ్యుల మద్య వింత పోటీ..!!
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. భార్యైనా ..భర్తైనా..కూతురైనా..తండ్రైనా.. రాజకీయాల్లో తాము గెలవాలన్న లక్ష్యంతో ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్దమవుతారనడానికి ఏపీ ఎన్నికలే సాక్ష్యం. అరకు పార్లమెంటు స్థానంలో తండ్రీకూతుళ్లు పోటీపడుతుంటే, విశాఖ పార్లమెంటు స్థానంలో వరసకు తల్లి కొడుకులు పోటీ పడుతుండటం విశేషం.

పేరుకు ఒకటే ఇల్లు..! కాని ఎగిరేవి మాత్రం ఆరు జెండాలు..!!
అరకు పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బరిలో ఉన్నారు. కిశోర్ చంద్రదేవ్ ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి అరకు ఎంపీ టిక్కెట్ ను తెచ్చుకున్నారు. ఇక ఇదే స్థానం నుంచి ఆయన కూతురు శృతీదేవి కూడా బరిలో ఉన్నారు. తమది అనాదిగా కాంగ్రెస్ కుటుంబమని, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి తండ్రి వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీని వీడనంటున్నారు. ఆమె కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు పార్లమెంటు స్థానంలో బరిలో ఉన్నారు.

ఒకే కుటుంబం నుండి మూడు పార్టీల అభ్యర్థులు..! ఎవరికి ఓటేయాలని అడుగుతారు..?
ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ తరుపున మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే ఇదే స్థానం నుంచి పురంద్రీశ్వరికి కుమారుడు వరసయ్యే శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వరుసకు కొడుకు అయ్యే శ్రీభరత్ తో చిన్నమ్మ పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ఒకే స్థానం నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఏపి లో విచిత్రంగా రాజకీయాలు..! రాజకీయ పిచ్చికి పరాకాష్ట..!!
ఇక కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య కమల స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం విశేషం. ఆమె కుమారుడు నితిన్ కృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ల పరిశీలనలో అధికారులు అతని పేరును తొలగించారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు వైసీపీ అభ్యర్థి పార్థసారథికి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇదిలా ఉంటే పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తుంటే, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. తొలుత కుమారుడు హితేశ్ చెంచురామ్ నే పర్చూరు నుంచి పోటీ చేయించాలనుకున్నా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో దగ్గుబాటి తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సివచ్చింది. ఇలా భార్యా భర్తలు చెరొక పార్టీ నుంచి పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కుటుంబాల్లో ఎవరిది గెలుపైనా..ఆ ఫ్యామిలీకి ఒక పదవి ఖాయంగా కన్పిస్తుంది.












Click it and Unblock the Notifications