పెద్దిరెడ్డి చేతిలో 62 నియోజకవర్గాలు - మిధున్ కి డిసైడింగ్ ఏరియా : సీఎంకు నమ్మకమా- అనివార్యమా....!!
వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన విశ్లేషణలు మొదలయ్యాయి. కేబినెట్ లో అందరినీ తప్పిస్తానని తొలుత చెప్పి..ఆ తరువాత 11 మంది పాత మంత్రులను సీఎం కొనసాగించారు. ఇక, ఇన్ ఛార్జ్ మంత్రులు..జిల్లా అధ్యక్షలు..పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియమకాల విషయంలో జగన్ కొందరికి ప్రాధాన్యత ఇచ్చిన అంశం స్పష్టంగా అర్దం అవుతోంది.
అందులో భాగంగా.. తొలి నుంచి పార్టీలో జగన్ కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి పెద్ద పీట వేసారు. కేబినెట్ లో ఆయనకు సీనియర్ మంత్రిగా విద్యుత్ - మైనింగ్ వంటి శాఖ లు అప్పగించారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం కల్పించారు.
పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయార్టీ వెనుక
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించారు. దీంతో పాటుగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను అప్పగించారు. దీంతో..ప్రభుత్వ - పార్టీ పరంగా పూర్తిగా అనంతపురం - చిత్తూరు జిల్లాల్లో పెద్దిరెడ్డి నిర్ణయాలు కీలకం కానున్నాయి.
అదే సమయంలో..అనూహ్యంగా ఏపీ ఎన్నికల్లో డిసైడింగ్ జిల్లాలుగా భావించే ఉభయ గోదావరి జిల్లాలు ప్రస్తుతం అయిదు జిల్లాలుగా మారాయి. ఈ మొత్తం జిల్లాల బాధ్యతలను పార్టీ ఎంపీ ..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేటాయించారు. ఈ జిల్లాల్లోనే అత్యధిక స్థానాలు ఉండటంతో..ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వారే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.
అటు సీమ ..ఇటు గోదావరి జిల్లాలు
దీంతో..రాయలసీమలోని రెండు జిల్లాలు - ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు తండ్రీ -తనయుడి చేతిలో ఉన్నాయి. ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - మిథున్ రెడ్డి కి ఇప్పుడు 9 జిల్లాలు..వాటి పరిధిలోని 62 నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పినట్లు అయింది. జిల్లా స్థాయిలో అధ్యక్షులు ఉన్నా.. తుది నిర్ణయంలో రీజనల్ కో ఆర్డినేటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు.
మిథున్ రెడ్డితో పాటుగా గోదావరి జిల్లాల్లో ప్రభావిత స్థాయిలో ఉన్న బీసీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అవకాశం ఇచ్చారు. శెట్టి బలిజ వర్గానికి చెందిన ఆయన తొలుత మంత్రిగా.. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించటం వెనుక కీలక పాత్ర పోషించారు.
2024 ఫలితాలు డిసైడింగ్ ఏరియాలు ఇవే...
ప్రధానంగా కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయటంతో పెద్దిరెడ్డి పైన సీఎం జగన్ కు మరింత నమ్మకం పెరిగింది. ఎటువంటి పరిస్థితిని అయినా పెద్దిరెడ్డి డీల్ చేస్తారనే నమ్మకం సీఎం జగన్ కు ఉందని పార్టీ నేతలు చెబుతారు. అందులో భాగంగానే..తాజాగా మంత్రి పదవి రాలేదని నొచ్చుకున్న సీనియర్ నేత పిన్నెళ్లిని సైతం పెద్దిరెడ్డిని కలవాల్సిందిగా సూచించారు.
కానీ, ఒకే కుటుంబానికి ఇంత ప్రాధాన్యత ఇస్తూ..ఏకంగా 62 నియోజకవర్గాల బాధ్యత వారికి అప్పగించటం పైన భిన్న కోణాల్లో పార్టీలో చర్చ సాగుతోంది. ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో - ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మాటకు ఎదురు లేదు.
సీఎం జగన్ కు నమ్మకమా - అనివార్యమా
తాజాగా మంత్రి రోజా కు మంత్రి పదవి విషయంలోనూ చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రాడ్డి - మిథున్ రెడ్డి పైన మాత్రం జగన్ భారీ నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
వారు ఈ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తే..అధికారం దక్కటంలో వారిద్దరూ కీలక పాత్ర ధారులు అవుతారు. చిన్న తేడా వచ్చినా సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో..ఇక పెద్దిరెడ్డి - మిధున్ రెడ్డి రాకీయంగా వేసే అడుగులు..నిర్ణయాలు..జగన్ వారి మాటకు ఇచ్చే ప్రాధాన్యత రానున్న రోజుల్లో మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.