వందే భారత్- తిరుపతి-స్వామి దర్శనం-ఓ కలా?
నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రూట్లోనే వందే భారత్ రైలును నడుపుతారని అధికారులు వెల్లడించారు.
మన దేశంలో ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 10 నడుస్తున్నాయి. అందులో ఒక్క వందే భారత్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తోంది. త్వరలోనే రెండో వందే భారత్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ మాటకు తగ్గ ప్రణాళిక రైల్వేశాఖ దగ్గర లేదు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి దీన్ని తిప్పబోతున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటికీ స్పష్టత రాకపోతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు నాలుగు మార్గాలున్నాయి.
అందులో ప్రస్తుతం నడుస్తున్న నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తున్న మార్గంలోనే వందే భారత్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయికానీ వందేభారత్ రావడమే తరువాయి అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం నారాయణాద్రి రైలు.. సికింద్రాబాద్- బీబీనగర్- నల్గొండ- మిర్యాలగూడ- నడికుడి- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- తెనాలి- బాపట్ల- చీరాల- ఒంగోలు- సింగరాయకొండ- కావలి- నెల్లూరు- గూడూరు- వెంకటగిరి- శ్రీకాళహస్తి- రేణిగుంట- తిరుపతి వరకు ఈ మార్గంలో పయనిస్తోంది.

మొదట నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రూట్లోనే ఈ వందే భారత్ రైలును నడుపుతారని అధికారులు వెల్లడించారు. శావల్యాపురం-ఒంగోలు రైలు మార్గం పూర్తికావడంతో ఆ మార్గంలోకి వందే భారత్ ను పంపిస్తారంటూ వార్తలు వచ్చాయి. న్యూ పిడుగురాళ్ల జంక్షన్ నుంచి శావల్యాపురం, ఒంగోలు మీదుగా తిరుపతికి వెళ్తుందని వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫిబ్రవరి రెండోవారంలో హైదరాబాద్లో పర్యటిస్తారని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారని రైల్వే శాఖ అధికారులు ప్రకటన చేయడమే కాకుండా అందుకు తగ్గ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధానమంత్రి భాగ్యనగరం రాలేదు.. వందేభారత్ కూడా ప్రారంభం కాలేదు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ను రైలును నడపాలని తిరుమల శ్రీవారి భక్తుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకునేందుకు 12 గంటల సమయం పడుతోంది. వందే భారత్ వస్తే ఆరున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ రైలును భవిష్యత్తులో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో తిప్పాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. వాస్తవానికి ఇప్పుడు నడిచే వందేభారత్ రైళ్లనే 180 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడే నడిపించాలని భావించినప్పటికీ అన్నిచోట్లా ట్రాక్ సామర్థ్యంపై పరీక్షలు నిర్వహించిన తర్వాతే వేగం పెంచాలని అధికారులు యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications