ఎవరీ రమేష్ కుమార్..ఆయనకు బంధువంటూ ! చంద్రబాబుతో సంబంధాలున్నాయా?
అమరావతి: ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం కొత్త వివాదానికి కారణమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం..వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా టర్న్ తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దీని పైన సీరియస్ అవ్వటం..గవర్నర్ కు ఫిర్యాదు చేయటం..సీఎంతో సహా మంత్రులు వరుసగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చేస్తున్న విమర్శలు..ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి తో సహా మంత్రులు సైతం రమేష్ కుమార్ టీడీపీకి మేలు చేసేందుకే ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ప్రభుత్వ విమర్శ. అయితే, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నిజంగా టీడీపీతో సంబంధాలు ఉన్నాయా..ఆయన చంద్రబాబు హయాంలో పని చేసారా..అసలు ఏం జరుగుతోంది..

నాటి టీడీపీ నేతకు బంధువంటూ...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా. 1982 బ్యాచ్ కు చెందిన రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఇక, ఆయన కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగానూ పని చేశారు. రమేష్ కుమార్ కు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సమీప బంధువుగా చెబుతున్నారు. దీంతో..ఆయనను చంద్రబాబు అంతగా ప్రాధాన్యత ఇచ్చే వారు కాదని తెలుస్తోంది. కానీ, అధికారిగా మాత్రం ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని సహచర అధికారుల్లో చర్చ.
1994 ఎన్నికల్లో లక్ష్మీపార్వతి టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తో కలిసి పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ..లక్ష్మీపార్వతి ఆ సమయంలో తిరుమలకు రాగా..వారిద్దరినీ ఈవోగా రమేష్ కుమార్ పని చేస్తున్న సమయంలో హంసవాహనం పైన ఊగేరించారని సహచర అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుండి లక్ష్మీపార్వతితోనూ రమేష్ కుమార్ కు పరిచయం బాగా పెరిగిందనే వాదన ప్రచారంలో ఉంది.

చంద్రబాబు హయాంలోనే ఎన్నికల కమిషనర్ గా..
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి తొలి ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ నియమితులయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన నియామకం జరిగింది. 2016 మార్చి 31న ఆయన పదవీ విరమణ చేశారు. అప్పటి వరకు దాదాపు ఏడేళ్ల పాటు నాటి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
అయితే, తొలుత తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బిశ్వాల్ పేరు ప్రతి పాదించగా..గవర్నర్ గా ఉన్న నరసింహన్ రమేష్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని కోరారని..కాదనలేక ఆయనను ఎన్నికల కమిషనర్ గా నియమించానని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుండి ఆయన ఆ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, తాజాగా స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం ముందు రోజు ఎన్నికల సంఘం నుండి కలెక్టర్లకు లేఖ వచ్చింది. అందులో కేవలం కోడ్ కారణంగా ఇళ్ళ స్థలాల పంపిణి నిలుపుదల చేయాలని మాత్రమే సూచించారు. కానీ, తెల్లారే సరికి మొత్తంగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవటం వెనుక అధికార వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
Recommended Video

రమేష్ కుమార్ కుమార్తెకు కీలక పోస్టు..
అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ కుమార్తె కు కీలక పోస్టు ఇచ్చారు. 2016లో నిమ్మగడ్డ రమేష్కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించిన చంద్రబాబు.. ఆయన కుమార్తె శరణ్యను ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్గా నియమించారు. ఆమెకు ఏకంగా నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ నియామకాన్ని..అదే విధంగా చంద్రబాబు ఓడిపోతున్నారనే కారణంగానే ఇప్పుడు ఆయనకు సహకరంచేలా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం మొదలు పెట్టారు.
ఇక, చంద్రబాబు సైతం అధికార పార్టీ ఏం చేసినా..తాము చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించటంతో అధికార పార్టీ తమ వాదనకు మరింత పదును పెట్టింది. అయితే, రమేష్ కుమార్ మాత్రం తన విచక్షణాధికారం..కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications