రోగ్ ఎవరు ? జగన్, రఘురామ మధ్య మరో కొత్త వివాదం-ఒపీనియన్ పోల్ కూడా
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుల విషయంలో భారీ చర్చ జరుగుతోంది. ఏపీ ఆర్దిక పరిస్ధితి నానాటికీ దిగజారడానికి అప్పులే ప్రధాన కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పరిమితుల్ని మించి అప్పులు చేస్తోందంటూ గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ప్రధానితో పాటు కేంద్ర ఆర్ధికమంత్రికి సైతం ఫిర్యాదులు చేశారు. దీనికి తాజాగా ఢిల్లీ పర్యటనలో జగన్ కౌంటర్ ఇచ్చారు.
గత నెలలో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీలో వైసీపీలో ఓ రోగ్ ఆర్ధికాంశాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆ ఫిర్యాదు ప్రతి కాస్తా రఘురామరాజు చేతిలో పడింది. దీంతో ఆయన ఇవాళ సీఎం జగన్ పై ఎదురుదాడికి దిగారు. ప్రధానికి జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ఓ రోగ్ అంటూ జగన్ ప్రస్తావించడంపై రఘురామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగ్ ఎవరో తేలుతుందంటూ రఘురామరాజు ఇవాళ వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రోగ్ ఉన్నాడని రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు అని లేఖలు రాస్తున్నాడని ప్రధానికి జగన్ లేఖ రాశారని తెలిపారు. ఇప్పుడు రోగ్ ఎవరని అందరికీ సందేహం కలుగుతోందన్నారు. రాష్టాన్ని అప్పుల్లో ముంచి నాశనం చేస్తున్నవారు రోగ్ అవుతారా? లేక ప్రశ్నించిన వారిని రోగ్ అంటారా?.. అసలు రోగ్ ఎవరని రఘురామరాజు ప్రశ్నించారు. రోగ్ ఎవరో చెప్పాలని సోషల్ మీడియాలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టానన్నారు. సాయంత్రానికి రోగ్ ఎవరనేది ప్రజలు చెప్తారని రఘురామరాజు తెలిపారు. దీంతో జగన్ రోగ్ వ్యాఖ్యలు రఘురామకు ఎక్కడో ఘాటుగా తగిలినట్లు కనిపిస్తోంది.