జూ ఎన్టీఆర్ వద్దు - పవన్ ముద్దు : మారుతున్న చంద్రబాబు లెక్కలు-జగన్ వ్యూహాలకు కౌంటర్ ప్లాన్..!!
ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. కుప్పం కేంద్రంగా చంద్రబాబు చేసిన పొత్తుల వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. జగన్ ను ఎలాగైనా అధికారం నుంచి దూరం చేయటానికి 2014 ఎన్నికల ముందు చేసిన విధంగా చంద్రబాబు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందు కోసం పదే పదే అందరూ కలిసి రావాలంటూ పార్టీల పేరెత్తకుండానే పిలుపునిస్తున్నారు.

చంద్రబాబు కొత్త లెక్కలతో రంగంలోకి
2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నేరుగా రాహుల్ గాంధీతో కలిసి పని చేసిన చంద్రబాబు..ఎన్నికల ఫలితాల నుంచి ఈ రోజు వరకు ఎక్కడా ప్రధాని - బీజేపీ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఇక, 2024 ఎన్నికల్లో విజయం కోసం ఈ ఏడాది చాలా కీలకమని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగా..ఆయన అన్ని నియోజకవర్గాలకు ముందుగా ఇన్ ఛార్జ్ ల నియామకం పైన ఫోకస్ చేసారు. వెంటనే తన సొంత నియోజకవర్గంలో పునాదులు కదలకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త పార్టీల ప్రతిపాదనలు - కాపు సామాజిక వర్గ నేతల వరుస సమావేశాలు..సామాజిక సమీకరణాలతో ఈ సారి కొత్త లెక్కలతో చంద్రబాబు సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

జూ ఎన్టీఆర్ కంటే పవన్ బెటర్ ఛాయిస్ గా..
అందులో భాగంగా గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని నినదించారు. కానీ, చంద్రబాబు స్పందించలేదు. అదే కుప్పంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలనే నినాదాలు వినిపించాయి. వెంటనే తనకు ప్రేమ ఉన్నా.. ఒన్ సైడ్ లవ్ సరిపోదని..అటునుంచి లవ్ ఉండాలంటూ పరోక్షంగా తాను సిద్దమంటూ స్పందించారు. దీని ద్వారా జూనియర్ కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ తోనే రాజకీయంగా మేలు జరుగుతుందనే అంచనాలో చంద్రబాబు ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. కొద్ది రోజులు వరుసగా సమావేశం అవుతున్న కాపు నేతలు తమ వర్గానికి చెందిన వారికి రాజకీయ ప్రాధాన్యత కలిగేలా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ తో ముందుకు కదులుతున్నారు.

జగన్ కు కౌంటర్ గా కొత్త లెక్కలతో
వారిలో ఎక్కువ మంది చంద్రబాబు - పవన్ కు మద్దతు దారులుగా ఉన్నవారే ఉన్నారు. అదే సమయంలో ఇటు విజయవాడలో నేరుగా వంగవీటి రాధా ఇంటికి వెళ్లి మరీ...వైసీపీ ట్రాప్ లో పడి రాధా ఆ పార్టీలో చేరకుండా చంద్రబాబు ముందస్తు వ్యూహం అమలు చేసారు. ఆయన తరువాత వరుసగా పార్టీ నేతలను రాధా ఇంటికి పంపారు. 2014 ఎన్నికల వేళ జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ అమలు చేయటానికి చంద్రబాబు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ప్రధానంగా నాలుగు జిల్లాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే శక్తిగా ఉన్న కాపు వర్గాన్ని ఆకట్టుకొనేందుకు అటు పవన్ ..ఇటు రాధాలతో కలిసి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీసీల పార్టీగా తిరిగి టీడీపీ టిక్కెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు.
Recommended Video

జగన్ ను ఢీ కొట్టాలంటే అందరితో కలిస్తేనే..
టీడీపీకి ప్రధానంగా అండగా నిలిచే వర్గం తమ పార్టీని కాదని వైసీపీ వైళ్లే అవకాశం లేదని టీడీపీ నేతల నమ్మకం. ఇక, ఎస్సీ - మైనార్టీ ఓటర్లలో వైసీపీ నుంచి తమ వైపు మళ్లించటం అంత సులువైన విషయం కాదనే చర్చ పార్టీలోనే కొనసాగుతోంది. అర్బన్ ఓటర్లలో బీజేపీ - టీడీపీ మధ్య చీలిక రాకుండా బీజేపీతో పొత్తు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, జూ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొచ్చి.. తన వారసుడికి భవిష్యత్ లో రాజకీయంగా పోటీకి అవకాశం ఇవ్వటం కంటే పవన్ ద్వారా రాజకీయంగా ప్రయోజనం సాధించాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో అవసరమైతే కాపు - బీసీ వర్గాలకు సీట్లు పెంచేందుకు సైతం సిద్దం అవుతున్నట్లుగా అప్పుడే పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి..చంద్రబాబు వ్యూహాలను పరిశీలిస్తున్న జగన్.. దీనికి ధీటుగా ఎటువంటి కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications