లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ యువ ఎంపీ..!?
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కేదెవరికి. 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏకు చెందిన ఎంపీనే చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా టీడీపీకి ఈ పదవి దక్కుతుందని చెబుతున్నారు. దీంతో, టీడీపీ నుంచి ఈ పదవి దక్కేదెవరికి. చంద్రబాబు ఎవరి పేరు వైపు మొగ్గు చూపిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
డిప్యూటీ దక్కేదెవరికి
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు సమ్మతించలేదు. దీంతో. ఎన్డీఏ ప్రతిపాదించిన స్పీకర్ కు పోటీగా ప్రతిపక్షం తమ అభ్యర్దిని రంగంలోకి దించింది. వాయిస్ ఓటింగ్ తో ఎన్డీఏ అభ్యర్ది ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా విపక్షాలు పోటీపడితే మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 2014లో మొదటిసారి మోదీ సర్కారు అధికారం చేపట్టగా లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహజన్, అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై ఉప సభాపతిగా ఉన్నారు.

టీడీపీకి ఛాన్స్ దక్కేనా
2019లో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీఏలోని ఓ పార్టీకి ఆ పదవి కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తరువాతి సంఖ్యా పరంగా చంద్రబాబు, నితీశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి రెండు మంత్రి పదవులే ఇవ్వటంతో మిత్రపక్షంగా డీప్యూటీ స్పీకర్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, చంద్రబాబు తమకు పదవుల కంటే తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి మద్దతు...ఆర్దికంగా తోడ్పాటు కావాలని కోరుతున్నారు.
ప్రచారంలో హరీష్ పేరు
టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే ఎవరికి ఇస్తారనేది చర్చ మొదలైంది. తాజాగా ఈ పేరు కోసం గతంలో టీడీపీ నుంచి ఎన్డీఏ హాయంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా.. స్పీకర్ గా వ్యవహరించిన బాలయోగి కుమారుడు హరీష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే గోదావరి జిల్లాల నుంచి ఎస్సీ వర్గానికి చెందిన యువ ఎంపీ హరీష్ కు డిప్యూటీ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీని పైన ప్రధాని మోదీ - చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేతల సమాచారం.












Click it and Unblock the Notifications