లోకేష్ని జైళ్లో పెడ్తామని బెదిరించారా?: బాబుకు శ్రీకాంత్
హైదరాబాద్: తన తనయుడు నారా లోకేష్ పైన కేసులు పెట్టి, జైల్లో పెడతామని బెదిరింపులు వచ్చినందువల్లనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంత్రుల బృందానికి(జివోఎం)కు ప్రతినిధులను పంపించడం లేదా చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు.
జివోఎంకు బాబు ప్రతినిధులను ఎందుకు పంపించడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం రావొద్దని ఆయనను ఆదేశించిందా లేక కేసులు, జైళ్లు అని బెదిరించిందా చెప్పాలన్నారు. విభజనపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఆత్మ గౌరవ యాత్ర ఎలా చేస్తారన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసుకు దత్తపుత్రుడు అన్న బాబే దొంగ పుత్రుడని మండిపడ్డారు. తనపై ఎలాంటి విచారణ జరపనందుకు కృతజ్ఞతగా చంద్రబాబు జివోఎంకు ప్రతినిధులను పంపించడం లేనట్లుగా కనిపిస్తోందన్నారు.
విభజనపై తమకు నాలుగు రోజులు ముందే ఎలా తెలిసిందని బాబు ప్రశ్నిస్తున్నారని కానీ, ఈ విషయం ఎల్లో మీడియా పత్రికలు స్పష్టంగా రాశాయని చెప్పారు. వాటి పైన బాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. రెండో విడత ఆత్మ గౌరవ యాత్రలో విభజనపై వచ్చే నష్టాల పైన ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెబుతారన్నారు. పబ్లిసిటీ కోసమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు.