పవన్తో ప్రచారం ఎందుకు: ధర్మాన, జగన్పై జైరాం ఫైర్
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీకి అంతగా బలం ఉంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేయిస్తున్నారో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు సోమవారం అన్నారు. టిడిపికి సీమాంధ్రలో బలం లేకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రుణమాఫీ చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల అన్నారు. చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. మన తలరాతను మనమే మార్చుకుందామని వైయస్ జగన్ వేరుగా అన్నారు. పేదవాడి గుండె చప్పుడు వినే పార్టీకి ఓటేయాలన్నారు.
జగన్ పైన జైరాం నిప్పులు
జగన్ పైన సీమాంధ్ర ఎన్నికల పర్యటనలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అవాస్తవాలే అన్నారు. డెబ్బై బెడ్ రూమ్లున్న రాజభవంతులు ఎలా వచ్చాయో చెప్పాలని, సునామీ వచ్చినట్లు జగన్కు అంతడబ్బు ఎక్కడ నుంచి వచ్చిందన్నారు.
ఐదేళ్లలో రాష్ట్ర విభజన ఫలితాన్ని సీమాంధ్ర ప్రజలు గమనిస్తారని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తామన్న జైరాం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ విటమిన్ ఎం సమస్య ఎదుర్కొంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలన్నీ వైయస్ అమలు చేశారన్నారు.
జైరాం సీమాంధ్రపై వరాల జల్లు కురుపిస్తున్నారు. సీమాంధ్ర అభివృద్ధికి 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని హమీ ఇచ్చారు. విజయవాడ, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. స్వలాభం, వ్యాపారం కోసమే కొందరు కాంగ్రెస్ను వీడారన్నారు.
కాంగ్రెస్ పథకాలనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర విభజన ఫలితాన్ని సీమాంధ్ర ప్రజలు ఐదేళ్లలో గ్రహిస్తారన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సీమాంధ్రులకు న్యాయం జరిగేలా చట్టం చేశామన్నారు.