'మేం చెప్పినట్లుగా పవన్ ఎందుకు చెప్పడం లేదు, జగన్ సహకరించినట్లే'
అమరావతి: జనసేన పార్టీతో కలిసి వెళ్తామని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు తప్ప ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రశ్నించారు. లెఫ్ట్తో వెళ్తామని ఆయన ఎక్కడా చెప్పడం లేదన్నారు. జనసేన ఇప్పటికీ బీజేపీకి మిత్రపక్షమేనని, ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీయే అన్నారు.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసిందని, జనసేన అలా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరవుతుందని, అలా చేయడం అంటే బీజేపీకి సహకరించినట్లే అన్నారు.

జమిలి ఎన్నికల విధానం అమలులోకి రావాలంటే 5 సవరణలు జరగాలని యనమల అన్నారు. ప్రస్తుతం మైనార్టీలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ ఆ సవరణలు చేసే పరిస్థితిలో లేదని చెప్పారు. జమిలి ఎన్నికలు దేశహితం కోసం కాదని, మోడీ - అమిత్ షాల హితం కోసం అన్నారు.
రాష్ట్రాల అజెండా ప్రజలలోకి వెళ్లకూడదనే జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. అవినీతి లేదు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చిందన్నారు. ఇక తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు.
బీజేపీ, టీడీపీ డ్రామా: బొత్స
పోలవరం ప్రాజెక్టును వదిలేసి, పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. నిర్మాణ వ్యయాలు పదేపదే ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. పోలవరంపై కేంద్రం డెడ్ లైన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిపిఆర్లో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలన్నారు.
అసలు పోలవరం పూర్తి చేసే ఉద్దేశ్యం బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్ కేటాయింపులు నామమాత్రమే అన్నారు. టీడీపీ, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications