కేంద్రం కొర్రీలు: పోలవరం కీలకమెందుకు, ప్రత్యామ్నాయం ఏమిటి?
అమరావతి: పోలవరం పనులకు సంబంధించిన పనుల టెండర్లను ఆపేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏమిటనే చర్చ సాగుతోంది. కేంద్రం ఆదేశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Recommended Video

ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కేంద్ర జలవరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై చర్చల కోసమే ఆయన ఢిల్లీ వెళ్తారని అంటున్నారు.
ఒకవేళ గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన పనులను కేంద్రం అంగీకరించకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారింది.

ఈ ప్రత్యామ్నాయమే మార్గమా....
కేంద్రం ప్రస్తుత పనులకు అంగీకరించకపోతే, కుడి, ఎడమ గట్లపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలే ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, 2019కి ప్రాజెక్టు పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రస్తుత స్థితిలో అది అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే అప్పటివరకు ఎత్తిపోతల పథకాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

గడువులోగా పూర్తి చేయాలని ఇలా...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలంటే ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ నుండి కొన్ని పనులను వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించక తప్పదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. ఈ విషయంపై చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించారు కూడా. ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చడానికి అంగీకరించని ఆయన కొన్ని పనులను మరో కాంట్రాక్టరుకు అప్పగించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే, కేంద్రం అందుకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది...
ఈపీసీ విధానంలోని 60సీ కింద ప్రధాన కాంట్రాక్టర్ వద్ద నుంచి తప్పించి కొన్ని పనులను ఇతర కాంట్రాక్టర్లకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈమేరకు పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వే, స్పిల్ ఛానల్ కాంక్రీటు, మట్టి పనులకు కూడా టెండర్లు ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. టెండర్లు పిలిచే సమయంలో వాటిని నిలిపివేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నుంచి లేఖ రావడంతో పరిస్థితి తారుమారైంది .

ట్రాన్స్స్టాయ్ సంస్థ ఇలా చేసింది...
పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్.ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచిన సమయంలో ట్రాన్స్ట్రాయ్ సంస్థ 14 శాతం తక్కువకు పనులను కోట్ చేసింది. ఇతర సంస్థలతో పోటీతో అలా తక్కువకు కోట్ చేయడంవల్లే ప్రస్తుతం ఆ సంస్థ పనులు చేయడానికి ఇబ్బంది పడుతోందని అంటున్నారు. ట్రాన్స్ట్రాయ్ సంస్థకు పనుల నిమిత్తం ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా సంస్థకు చెల్లించే బిల్లునుండి మినహాయించుకునేలా వెలుసుబాటు ఇచ్చారు.

అయినా కూడా అంతే...
వెసులుబాట్లు కల్పించినప్పటికీ ట్రాన్స్ట్రాయ్ ఇబ్బంది పడుతుండటంతో కొన్ని పనులను ఇతర సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్లే ప్రస్తుతం కేంద్రంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు.

అంచనా వ్యయం ఇలా పెరిగింది...
పనుల్లో జరిగిన జాప్యం వల్లనే కాకుండా భూసేకరణ చట్టంలో వచ్చిన మార్పుల వల్ల సహాయ, పునరావాసానికి పెట్టాల్సిన ఖర్చులు పెరగడంతో 2010లో రూ.16,010 కోట్లు ఉన్న అంచనా వ్యయం 2014 ఏప్రిల్కి రూ. 58,319 కోట్లకు పెరిగింది. ఇందులో పునరావాస వ్యయమే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రూ.33 వేల కోట్లకు పెరిగింది.

పట్టిసీమపై అందరి దృష్టి
ప్రస్తుత వివాదం నేపథ్యంలో పోలవరం కుడి కాలువ ఆధారంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల, ఎడమ కాలువ ఆధారంగా నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై దృష్టి పడింది. గోదావరి నదిలో నీటి ఉద్ధృతి కొనసాగినంత కాలం ఈ రెండు పథకాలతో కొంతమేర ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖ జిల్లాలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటిపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

కీలకం పోలవరం ప్రాజెక్టే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం అత్యంత కీలకమైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన 42 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద ఈ ప్రాజెక్టును చేపట్టారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 7 లక్షల 20వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. విశాఖ జిల్లాలో 10 మండలాల్లో లక్షా 50వేల 71 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 21 మండలాల్లో 2 లక్షల 49వేల 872 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మండలాల్లో 2 లక్షల 58వేల 142 ఎకరాలు, కృష్ణా జిల్లాలో ఆరు మండలాల్లో 61వేల 258 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

రాజకీయంగా కూడా చంద్రబాబుకు కీలకం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడికి రాజకీయంగా అత్యంత కీలకమైంది. వచ్చే ఎన్నికలలోగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికల్లో దాన్ని వాడుకోవాలనేది ఆయన వ్యూహం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ దాన్ని పూర్తి చేశానని చెప్పుకోవడానికి పనికి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భుజాన వేసుకున్నట్లు చెబుతారు. అయితే, కమిషన్ల కోసమే చంద్రబాబు ఆ పనిచేశారని ప్రతిపక్షాల విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications