వెంకయ్యనాయుడి నోట పదే పదే అదే మాట: ఎందుకు?
విజయవాడ: తాను ఆంధ్ర నాయకుడిని కాదని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు పదే పదే ఎందుకుంటున్నారనేది కాస్తా ఆలోచించాల్సిన విషయమే. అవకాశం లభించిన ప్రతిసారీ ఆయన అదే మాట అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తనపై విమర్శలు వచ్చిన సందర్భంలో ఆయన విసుక్కున్నారు కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభకు గెలిచారు. అయితే, బిజెపిలో ఆయన క్రమక్రమంగా అగ్రస్థానానికి ఎదిగారు. ఓ స్థితిలో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. బిజెపిలోని అత్యంత కీలకమైన నేతల్లో ఒక్కరిగా, నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.
అయితే, ఆయన రెండు సార్లు కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా ప్రస్తావించి, తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసే ధోరణిని వ్యతిరేకించారు. అయితే, ఆయన తాను ఆంధ్ర నాయకుడిని కాదని చెప్పుకోవడానికి ఇప్పుడున్న సందర్భం వేరు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వ్యతిరేకంగా వ్యవహరించారని, రాజ్యసభలో ఎపికి ప్రత్యేక హోదాను పదేళ్లకు పెంచాలని పట్టుబట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయనపై తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నిందను ఆయన ఇప్పటికీ మోస్తున్నారు. అయితే, తాను ఆంధ్ర నాయకుడిని కానని, తెలుగు ప్రజలకు చెందిన వ్యక్తినని చెబుకుంటున్నాడు. తద్వారా తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, తెలంగాణకు కూడా చెందినవాడినని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
మొత్తంగా తనకు తెలుగు ప్రజల మేలు కావాలని, అదే తాను కోరుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల తనకు ప్రత్యేక ప్రేమ లేదని, తెలంగాణ పట్ల వివక్ష లేదని ఆయన ప్రకటించుకోదలుచుకున్నట్లు భావిస్తున్నారు. అందువల్లనే ఆయన పదే పదే ఆ మాట అంటున్నట్లు భావిస్తున్నారు.