టీడీపీ కంటే జనసేనే బెటరా ? వైసీపీ మాజీల క్యూ-ఓసారి వెళ్లినా రిటర్న్..!
ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉమ్మడి పోరాటాలతో అధికారం దక్కించుకున్న కూటమి పార్టీల కాపురం సజావుగానే సాగిపోతోంది. అయితే తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 164 సీట్లతో పటిష్టంగా కనిపిస్తున్న కూటమి పార్టీల్లో ఏదో ఒక దాంట్లో ఫిరాయిస్తే తాము సేఫ్ అని గతంలో వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు భావిస్తున్నారు. ఇలాంటి వారికి టీడీపీ, జనసేనలో ఎందులోకి వెళ్తే బెటర్ అన్న ఆలోచన వచ్చినప్పుడు అందులో పవన్ పార్టీ బెటర్ గా కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో మూడు పార్టీల్లో క్షేత్రస్ధాయిలో పూర్తిగా బలం ఉన్న పార్టీ టీడీపీ మాత్రమే. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు కైవసం చేసుకున్నా క్షేత్రస్దాయిలో ఇంకా క్యాడర్ అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీని వీడి కూటమిలోకి రావాలనుకునే వారు సహజంగా అయితే టీడీపీకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వైసీపీ జంప్ జిలానీలు పలు చోట్ల టీడీపీని కాదని జనసేనలోకి క్యూ కడుతున్నారు.

తాజాగా జనసేనలో చేరిన కైకలూరు నేత జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నేత గంజి చిరంజీవి వారి సామాజిక వర్గాల పరంగా చూసినా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలోకే వెళ్లాలి. కానీ అలా కాకుండా వారు జనసేనలోకి వచ్చేశారు. గతంలో విజయవాడ కార్పోరేషన్ లో వైసీపీ కార్పోరేటర్లు కొందరు టీడీపీలోకి వెళ్లిన కొన్ని రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వచ్చారు. అలాగే తాజాగా వైసీపీని వీడి టీడీపీ సభ్యత్వం తీసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సైతం ఆ పార్టీని కూడా వీడి జనసేనలోకి వచ్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇదంతా ఓ ఎత్తయితే గతంలో జనసేనలో చేరిన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్య.. వీరి రాజకీయ అనుభవం, ఇతరత్రా లెక్కలు చూసుకున్నా టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ వారు అలా చేయకుండా పవన్ సమక్షంలో జనసేనలోనే చేరారు. గతంలో పవన్ ను భీమవరంలో ఓడించిన గ్రంథి శ్రీనివాస్, పవన్ పార్టీలో గెలిచి వైసీపీకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్ ఇలా ఎంతో మంది జనసేనలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే టీడీపీలో వీరందరికీ ఎంట్రీ లేదా, ఉన్నా వీరు చేరకపోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో టీడీపీలో ఉన్న వీరి రాజకీయ ప్రత్యర్దులు ఓ కారణంగా ఉంటే, ప్రస్తుతం నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనే బెటర్ అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు, లోకేష్ తో పోలిస్తే పవన్ చేస్తున్న యాక్టివ్ పాలిటిక్స్ ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. ఇలా ఎన్నో కారణాలు టీడీపీ కంటే జనసేననే ఫిరాయింపు నేతలకు బెటర్ గా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications