ముందస్తు ఎన్నికలతో సీఎం జగన్ కు పవర్ పక్కనా - అస్త్రాలు సిద్దం..!!
తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని అటు అధికార పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ పార్టీకి లాభమా? నష్టమా అన్న ప్రశ్నలకు లాభమే ఎక్కువనే సమాధానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిజేపీ వ్యతిరేక ఓట్ల శాతం పెరుగుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోంది.
ఏపీలో వైసీపీ- బిజేపీ ఒక్కటే అనే భావన వచ్చేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటుకంటే, అసెంబ్లీకి విడిగా అంటే ముందస్తుగా ఎన్నికలు జరిగితే ఈ తరహా ప్రచారానికి ఆస్కారం ఉండదనేది వైసీపీ ముఖ్య నేతల భావన. టీడీపీ-జనసేన పొత్తు ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేదు. టిడిపి-జనసేన మధ్య పొత్తులు, సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా జగన్ సిద్ధపడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.

2019 ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 49.95 శాతం ఓట్లు వైసీపీకి పడగా, 39.17 శాతం ఓట్లతో తెలుగుదేశం 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలవగా, 5.53 శాతం ఓట్లు పడ్డాయి.
సినీ హీరోగా, అశేష అభిమానులున్న పవన్ కళ్యాణ్ రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ నోటాకుపడ్డ ఓట్లను కూడా తెచ్చుకోలేక 1.17 శాతం ఓట్లను ఖాతాలో వేసుకుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాల్లో సైతం వైసీపీ స్వీప్ చేసింది. గత ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి- టిడిపికి మధ్య ఓట్ల శాతం పదికంటే ఎక్కువే.

వైఎస్ జగన్ వచ్చీరాగానే నాలుగు లక్షల మందికి గ్రామ సచివాలయాలకోసం రిక్రూట్ చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లారు. రెండున్నర లక్షల దాకా వాలంటీర్లు క్షేత్రస్థాయిలో జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో బిజీగా ఉన్నారు. ఏ ఒక్క నాయకుడి సిఫారసుతో పనిలేకుండా అర్హత ఉంటే చాలు...సంక్షేమ పథకాల డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడిపోతున్నాయి.
చెప్పినట్లుగానే సామాజిక భద్రత కింద ఇస్తున్న పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీకే పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యం కూడా ఇంటి వద్దకే పంపి అందిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తు, ఏటా 15 వేల రూపాయలు అందిస్తున్నారు. వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు 15 వేల రూపాయలు అందిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు, రజకులకు, నాయీ బ్రాహ్మణులకు 10 వేల రూపాయల తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు వేస్తున్నారు.

ఆరోగ్య శ్రీ పథకంలో కొత్తగా అనేక వ్యాధులను చేర్చారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామంలో క్లినిక్లు నిర్వహిస్తున్నారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా మార్చివేశారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమూలంగా మార్చివేశారు. రోజుకో మెనూ పెట్టి పిల్లలు ఆహారాన్ని ఇష్టంగా తినేటట్లు చేస్తున్నారు. రైతులకు ఏటా 13500 రూపాయల సాయం చేస్తున్నారు. రైతుల కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ఈ పథకాలన్నింటితో ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు. సహజంగా అధికార పార్టీపట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. జగన్ ప్రభుత్వం పట్ల ఈ వ్యతిరేకత ఇప్పుడు 5 శాతం కూడా లేదనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే...వైనాట్ 175? అన్న జగన్ నినాదం నిజం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ అగ్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలలో వైసీపీకి కొంత వ్యతిరేకత ఉందనే విధంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లూ టీడీపీ ఖాతాల్లో పడిపోయాయి. దీని తరువాత జగన్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీలో సమూల మార్పులు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిల సేవలను ఎక్కడ ఎంత వరకు పార్టీకి వాడుకోవాలో స్పష్టమైన విభజన రేఖ గీసేశారు. ఎమ్మెల్యేలతో, మంత్రులతో టచ్లోకి వచ్చారు. చివరకు వాలంటీర్లతో కూడా ఒక రోజు గడిపారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్న వారికి జవాబుగా రామాయపట్నం, గంగవరం, బందరు ఓడ రేవుల శంకుస్థాపనలేకాదు, పనులు కూడా మొదలుపెట్టేశారు. విశాఖ రాజధాని ఏమైందని ప్రశ్నించేవారికి సమాధానంగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రెడీ అయిపోయారు.

తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు సూత్రప్రాయంగా ఓకే అయిపోయినా, సీట్లు, సర్దుబాట్లు తేలడం అంత ఈజీకాదు. పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు వల్ల కాపులు తమకే ఓట్లు వేస్తారని భావిస్తున్న చంద్రబాబు వ్యూహం ఈసారి అమలయ్యేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అయినప్పుడు కాపులు టిడిపి-జనసేన కూటమికి ఓట్లేస్తారుకానీ, మరోసారి చంద్రబాబును సీఎం చేయడానికి కాపులు ఎందుకు త్యాగం చేస్తారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు విషయానికి వస్తే ఎన్నికలకు ఇంకా టీడీపీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసుకోలేదు. పొత్తుల కథ ఇంకా మొదలేకాలేదు. అభ్యర్ధుల సెలెక్షన్ కూడా తెగేది కాదు. విపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ గందరగోళాన్ని జగన్ క్యాష్ చేసుకోవాలనే అంచనాలతో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications