జగన్ గూటికి జెసి తనయుడు, తాడిపత్రి నుండి పోటీ?

ఇప్పటి వరకూ జిల్లా రాజకీయాల్లో జెసి బ్రదర్స్ చక్రం తిప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయం వీరిలో కాంగ్రెస్ పార్టీ పట్ల అసహనాన్ని పెంచింది. జెసి అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జెసిపై చర్యలు తీసుకోవాలని పిసిసి చీఫ్ బొత్స అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో జెసి పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది.
దీంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జెసి తనయుడు పవన్ తాడిపత్రి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం హైదరాబాద్లో ఉంటూ వ్యాపార లావాదేవీల్లో నిమగ్నమయ్యే పవన్ గత కొంతకాలంగా తాడిపత్రి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే అభిప్రాయంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని జగన్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించారట. జెసి దివాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో జగన్కు సానుకూలంగా సమైక్యాంధ్రకు కలిసి పని చేయడానికి సిద్ధపడ్డారట. పవన్కు కూడా జగన్ పార్టీతోసత్సంబంధాలు ఉండటంతో త్వరలో అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని చెబుతున్నారు. మరోవైపు జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరనున్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. జెసి బ్రదర్స్ రాకను పరిటాల సునీత వ్యతిరేకించారు.
వైయస్ జగన్ తనకు బాల్యస్నేహితుడని జెసి పవన్ తెలిపారు. తాడిపత్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తరచుగా జగన్తో కలుస్తూ ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి నిలబడతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. తన తండ్రి జెసి దివాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతుండడంతో తాను పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకపోలేదన్నారు. బాబాయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం తాను నడుచుకుంటానన్నారు.












Click it and Unblock the Notifications