అవసరమైతే నవరత్నాల్లో మార్పులు: వైఎస్ జగన్, 39వ రోజుకు చేరిన పాదయాత్ర
అనంతపురం: రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా తమ పార్టీ నవరత్నాలను ప్రకటించిందని, వాటిలో మార్పులు, చేర్పులు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారానికి 39వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది. మంగళవారం జిల్లాలోని మరాల గ్రామంలో జగన్ పాదయాత్ర చేశారు.
పాదయాత్రలో భాగంగా గ్రామంలోని రైతుల కష్టాలను జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. రైతులు పంటలు వేసే సమయంలో పెట్టుబడుల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రైవేటు వడ్డీలపై ఆధారపడాల్సివస్తోందని, తాము అధికారంలోకి రాగానే రైతన్న భరోసా పేరుతో పత్రి ఏడాది మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
అలాగే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని జగన్ అన్నారు. ప్రజలకు అసత్యాలు చెప్పే నాయకుడు కావాలా? మోసం చేసే నాయకుడు కావాలా? అని జగన్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడికి గుణపాఠం నేర్పాలని ఆయన కోరారు.