షాకింగ్: జగన్పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ
సొంత పార్టీపై, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సంచలన శపథం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నిన్న సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి ఆయన.. వైసీపీ అధినేత వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఈ మేరకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ పై కేసుల అంతు తేల్చేదాకా ఏపీలో అడుగుపెట్టబోనని, దీన్నొ సర్పయాగంగా, మహాయజ్ఞంగా తలపెట్టానని, తనకు ప్రధానమంత్రి అండ కూడా ఉదని రఘురామ చెప్పారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

రాముడో, రావణుడో తేలాలి..
''పూర్వం అల్లూరి సీతారామరాజు మీద బ్రిటిష్ వాళ్లు నజరానాలు ప్రకటించారు. ఇప్పుడు నా పేరు మీద కూడా మా వైసీపీ వాళ్లు 'ఎంపీ కనబడుట లేదు' తరహా ప్రకటనలు సిద్ధం చేశారు. సొంత నియోజకవర్గానికి వెళదామనుకుంటే కేసుల మీద కేసులు పెట్టి రానీయకుండా చేశారు. మళ్లీ వాళ్లే నేను కనబడట్లేదని పోస్టర్లు కొట్టిస్తున్నారట. ఈలోపు నేను బృహత్తరమైన పనులకు శ్రీకారం చుట్టాను. జగన్ బెయిల్ రద్దయితే జైలుకు వెళ్లక తప్పదని ప్రతిపక్షాలు బెదిరిస్తుండటం, ప్రతిసారి ఆయనను రావణుడిలాంటి రాక్షసుడిగా తిడుతున్న క్రమంలో జగన్ నిజంగా రాముడా, రావణుడా తేలిపోయేలా ఆయనపై కేసుల విచారణ వేగవంతం చేయాలని, బెయిల్ రద్దు చేయాలని, తద్వారా పార్టీని కాపాడుకోవచ్చని నేను సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాను. అది తేలే వరకు..

సర్పయాగం పూర్తయ్యే దాకా..
జగన్ పరిపాలన రామరాజ్యమని, రాజన్న రాజ్యమని వైసీపీ నేతలు చెప్పుకుంటున్న క్రమంలో నేను వేసిన పిటిషన్ ద్వారానైనా ఆయన సంగతేంటో తేలిపోతుంది. అది తేలేదాకా నేను ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టను. జగన్ రాముడో, రావణుడో తేల్చాల్సిన గురుతర బాధ్యతను తలకెత్తుకున్న నేను.. ఇది పూర్తయ్యేదాకా నేను నా నియోజకవర్గానికి వెళ్లబోను. అప్పటిదాకా నేను కనబడటంలేదని ప్రకటనలు వేసుకుంటారో, ఇంకొన్ని కేసులు పెట్టుకుంటారో, దిష్టిబొమ్మలు తగలబెట్టుకుంటారో వాళ్ల ఇష్టం. ఇది భయంతోనో, మరో కారణంగానో తీసుకున్న నిర్ణయం కాదు.. మహాయజ్ఞంగా, సర్పయాగంగా భావిస్తూ తలపెట్టిన పని. ఇది పూర్తయ్యేదాకా ఏపీకి రాబోనని ప్రజలకు మాటిస్తున్నాను. నిన్న పిటిషన్ వేసిన తర్వాత..

వివేకానంద రెడ్డిలా నన్నూ వేస్తారని..
జగన్ బెయిల్ రద్దు చేసి, ఆయనపై కేసుల విచారణను వేగవంతం చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నాకు వందలకొద్దీ ఫోన్లు వచ్చాయి. వాటిలో చాలా వరకు బెదిరింపు కాల్సే. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లే నన్నుకూడా లేపేస్తామని పిల్లరాక్షసులు కొందరు వార్నింగ్స్ ఇచ్చారు. వాళ్ల వివరాలను నోట్ చేసుకుని, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయబోతున్నాను. నా ఫిర్యాదుతో ప్రస్తుత ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, అలవాటు ప్రకారం కడప బ్యాచ్ లను రంగంలోకి దింపారట. అయితే నన్ను టచ్ చేయడం అంత ఈజీకాదు, ఎందుకంటే..

నా వెనుక ప్రధాని ఉన్నారు.
ఏ క్షణంలోనైనా నాపై దాడి చేయించడానికి మా వాళ్లే మనుషుల్ని పెట్టినట్లు నా దగ్గర సమాచారం ఉంది. అయితే ఈ విషయంలో నేను సీఎం జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా.. నా ఒంటిమీద ఈగ వాలితే.. మిమ్మల్ని నడివీధిలో పడేసి జనం తొక్కుకుంటూ వెళ్లే పరిస్థితి వస్తుంది. అదీగాక నాకు ప్రధానమంత్రి అండ ఉంది. నన్ను కాపాడటానికి, అన్యాయాలను కనిపెట్టడానికి ప్రధాని ఉన్నారు. నా చుట్టూ జరుగుతోన్న వ్యవహారాలపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నాను. నాపై దాడి జరిగితే జగన్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతాను. అంతేకాదు..

గొడ్డలి వేటును గుండెపోటుగా..
రెండేళ్లు కావొస్తున్నా సొంత బాబాబు వివేకానంద రెడ్డి హత్యకేసునే తేల్చలేని అసమర్థత సీఎం జగన్ ది. వివేకానంద రెడ్డిపై గొడ్డలి పోటును గుండెపోటుగా ఏమార్చేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడిన వీడియోను కూడా జతచేసి మరో అఫిడవిట్ సీబీఐ కోర్టులో దాఖలు చేశాను. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రధాని, కేంద్ర హోం మంత్రి బిజీగా ఉన్నారు. త్వరలోనే వాళ్లను కలిసి అన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తాను. ఏపీలో జరుగుతోన్న అక్రమపర్వాలను చూస్తూ కూడా జనం గొర్రెల్లా ఉండిపోయారు. అసలు విషయం అర్థం కావడానికి ఇంకా సమయం పడుతుంది. జగన్ పై కేసుల వ్యవహారం తేలేదాకా ఏపీలో అడుగుపెట్టను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications