జగన్ కు లేఖతో రఘురామ బయటపడ్డారా ? వైసీపీని మరింత ఇరికించారా.. !
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటన తర్వాత అధినేత జగన్ కు ఇచ్చిన వివరణ చూస్తుంటే ఆయన పార్టీ అడిగిన ప్రశ్నలకు సంజాయిషీ ఇచ్చినట్లుగా కంటే వారిని మరింత ఇరుకునపెట్టినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ కు పంపిన సమాధానంలో క్రిస్టియానిటీకి సంబంధించి రఘురామ చేసిన వ్యాఖ్యలు వైసీపీని మరింత ఇబ్బందిపెట్టేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. దీంతో రఘురామ లేఖపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
కాసేపట్లో జగన్ కు రఘురామకృష్ణంరాజు సమాధానం- వివరణపై ఉత్కంఠ...
జగన్ కు రఘురాముడి సమాధానం...
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీ నేతలపై కత్తులు దూస్తున్న వ్యవహారంలో పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎట్టకేలకు ఢిల్లీ పర్యటన నుంచి రాగానే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధినేత జగన్ కు సమాధానం పంపారు. అందులో ఆయన చెప్పిన విషయాల్లో చాలా మటుకు అందరూ మాట్లాడుకుంటున్నవే తాను చెప్పానని చెప్పినా ఒక్క విషయం మాత్రం తాను కావాలనే ప్రస్తావించినట్లు అర్ధమవుతోంది. అదీ తన భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగపడేలా ఆయన జాగ్రత్త పడ్డారని అర్ధమవుతోంది. దీంతో ఈ అంశంపై ఎలా స్పందించాలో ఇప్పుడు వైసీపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ అజెండా పరోక్ష ప్రస్తావన...
జగన్ కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు రెండు కీలక అంశాలు ప్రస్తావించారు. ఇందులో ఒకటి క్రిస్టియానిటీ, రెండు తెలుగుభాష. ఈ రెండు అంశాలపై తాను గతంలో మాట్లాడిన విషయాలను సమర్ధించుకుంటూ రఘురామ ఇచ్చిన సమాధానం చూస్తే వాటిపై తాను యథాలాపంగా స్పందించలేదని అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీ పదేపదే జగన్ కు ఇరుకునపెడుతున్న క్రిస్టియానిటీ, ఇంగ్లీష్ మీడియం అంశాలకు తాను మద్దతుగా ఉన్నాననే విషయాన్ని మరోసారి చెప్పుకునేందుకు రఘరామ తపన పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వైసీపీపై పోరుబాటను ఎంచుకున్నారని సాగుతున్న ప్రచారాన్ని బలపరిచేలా జగన్ కు ఆయన రాసిన లేఖ ఉందనే ప్రచారం సాగుతోంది.
విపక్షాల వాదనకు బలం చేకూర్చేలా..
జగన్ కు రఘురామకృష్ణంరాజు రాసిన లేఖలో పలు అంశాలు విపక్ష టీడీపీ, బీజేపీ కొంతకాలంగా పోరాడుతున్నవే కావడం విశేషం. టీటీడీ ఆస్తులు, క్రిస్టియానిటీ, ఇంగ్లీష్ మీడియం అమలుపై ఇప్పటికే విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరోసారి ప్రస్తావించడం ద్వారా వారి అజెండా తాను వైసీపీలోనే ఉంటూ అమలు చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు చెప్పినట్లయింది. వాటికి ప్రజల్లో అదే భావన ఉందన్న కలర్ మాత్రమే కొత్తగా ఇచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలే తాము లేవనెత్తిన అంశాలపై విమర్శలు చేస్తున్నారంటూ విపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు కూడా ఈ లేఖ అవకాశం ఇచ్చింది.
Recommended Video
వైసీపీ మల్లగుల్లాలు...
రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన చర్యలపై సమాధానం ఇస్తారని భావిస్తే ఏకంగా పార్టీని మరింత ఇరుకున పెట్టేలా లేఖ రాయడంతో దీనిపై ఎలా స్పందించాలన్న విషయంపై వైసీపీ కసరత్తు చేస్తోంది. వివరణతో సంతృప్తి చెందక వేటు వేస్తే సులభంగా బీజేపీలో చేరిపోయే అవకాశం ఉండటంతో మరికొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని నాన్చాలనే ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ లోపు మరోసారి రఘురామకృష్ణంరాజు నోరు జారితే అప్పుడు చూద్దామనే భావన కూడా పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీకి, రఘురాముడికీ మధ్య ఈ గిల్లికజ్జాలు మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.