చంద్రబాబు! మాతో కలుస్తావా: హోదాపై బొత్స సవాల్, అన్నీ చెప్పాం: సుజన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 18 నెలలు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.
ప్రత్యేక హోదా పైన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిధులు, ప్యాకేజీ విషయంలో కేంద్రం పైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఒత్తిడి తీసుకు రావడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బొత్స డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం తాము పార్లమెంటులో డిమాండ్ చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన గొంతెత్తుతామన్నారు. అందుకు టిడిపి నేతలు తమతో కలిసి వస్తారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు తదితర కేసుల నేపథ్యంలో తమ పైన విచారణ జరగకుండా ఉండేందుకు టిడిపి కేంద్రమంత్రులు, టిడిపి ఎంపీలు పార్లమెంటులో నోరు మెదపడం లేదన్నారు.
ఇన్ని నెలలు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని మేం ఆనాడే చెప్పామన్నారు. కోస్తా రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాం: సుజన
ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. అనంతరం టిడిపి ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడారు.
ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా గురించి తాము భేటీలో లేవనెత్తామని చెప్పారు. ఏపీలోని వరదలు, రైతు సమస్యలను ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరామని, విభజన హామీలు నెరవేర్చాలని చెప్పామన్నారు.
చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరకేంగా జీవోను రద్దు చేయాలని విజయవాడలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బుధవారం స్థానిక లెనిన్ సెంటరులో సిపిఐఎల్ న్యూడెమోకారసీ నేత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.