తెలంగాణలో చంద్రబాబుకు కష్టమేనా, సీమాంధ్రలో జోష్
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవడం కష్టమేనా? సీమాంధ్రలో క్రమంగా ఆ పార్టీ బలం పెంచుకుంటోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన బిల్లు ఢిల్లీకి చేరడంతో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడు పెంచడంతో, తెలంగాణ టిడిపి నేతలు ఇరకాటంలో పడ్డారంటున్నారు.
ఇంతకాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు టిడిపి కట్టుబడి ఉందంటూ గట్టిగా వాదన వినిపించిన తమకు, పార్టీలో సీమాంధ్ర నేతలు చేస్తోన్న ఆందోళన వల్ల ఇబ్బందులు తప్పవని టి టిడిపి నేతలు చెబుతున్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసే వరకు విభజన బిల్లు పార్లమెంట్కు వెళ్లకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం, అలాగే పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని ఇంతకాలంగా చెప్పిన బిజెపి వైఖరిలో కొంత మార్పు రావడానికి చంద్రబాబు వైఖరే కారణమని పలువురు అనుమానిస్తున్నారు.
సమన్యాయం అని సీమాంధ్ర టిడిపి, చంద్రబాబు చెబుతున్నప్పటికి దాని గూడార్థం విభజన వద్దని చెప్పడమేనని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపికి కష్టమే అంటున్నారు. మరోవైపు ముఖ్యనేతలు అయిన మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు అలకతో ఉన్నారు. టిడిపి తీరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, అందుకే ఆ పార్టీ నుండి పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు.
ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఇంతకాలంగా టిడిపి అధిష్ఠానం చేసిన వాదన వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినప్పటికీ, బిజెపి అగ్రనేతలను చంద్రబాబు కలిసిన తర్వాత ఆ పార్టీలో వచ్చిన మార్పు తెలంగాణ టిడిపిలో కలవరపాటు కలిగిస్తోందట. సీమాంధ్ర టిడిపి నేతల వైఖరితో పార్టీ చంద్రబాబుకు సంబంధం లేకపోయినా దానిని ప్రజల్లో చెప్పలేని పరిస్థితి టి టిడిపి నేతలది అంటున్నారు.
మరోవైపు సీమాంధ్రలో ఆ పార్టీ క్రమంగా పుంజుకుంటోందంటున్నారు. కాంగ్రెసు పార్టీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉండటం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లుగా విపక్షాలు చెబుతున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో టిడిపి క్రమంగా పుంజుకుంటోందని సర్వేల్లో కూడా తేలిందని ఆ పార్టీ సీమాంధ్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.