చంద్రబాబుకు ఊరట!: కేంద్రంలో తెరాస చేరిక బీజేపీ కోర్టులో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చుననే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో చేరే అంశం పైన తెరాస నేతలు కూడా భిన్నంగా స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే, కేంద్రంలో తెరాస చేరే అంశం ఎన్డీయే నిర్ణయమని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో తెరాస చేరికపై ఎన్డీయేదే తుది నిర్ణయమని చెప్పారు.
తెరాస పార్టీ బీజేపీకి దగ్గరవుతుందనే సంకేతాల గురించి విలేకరులు ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ అంశం తన పరిధిలో లేదని, ఎన్డీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
తెరాస ఎన్డీయేలో చేరితే బీజేపీతో బంధాన్ని తెంచుకుంటామన్న తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు వ్యాఖ్యల పైన కూడా ఆయన స్పందించారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో తెరాస చేరుతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. దీని పైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పలు సందర్భాల్లో స్పందించారు. కేసీఆర్ తన కూతురుకు కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకు బీజేపీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, కిషన్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా.. తెరాస చేరికపై ఇప్పటికిప్పుడు స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లుగా అనిపించడం లేదు. పైగా, తెరాస చేరిక ఎన్డీయేదే తుది నిర్ణయమని ఆయన చెబుతున్నారు. తద్వారా తెరాసకు షాకివ్వడంతో పాటు, తెలంగాణ టీడీపీకి ఊరటనిచ్చారనే చెప్పవచ్చు.