ఏపీ కరోనా విలయం: కర్నూలు కకావికలం.. షాకింగ్ నంబర్స్.. కృష్ణా, గుంటూరులో భయంభయం..
అభివృద్ధి సంగతేమోగానీ కొవిడ్-19 కేసుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గట్టి పోటీ నెలకొనడం విషాదకరం. గంట గంటకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 970 కేసులుండగా, శుక్రవారం నాటికి ఏపీ కూడా దానికి చేరువైంది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. ఏపీలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 62 కేసులు బయటపడ్డాయి. దీంతో టోటల్ కేసుల సంఖ్య 955కు పెరిగింది. ఇందులో 145 మంది మాత్రమే వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజాగా మరో ఇద్దరు కన్నుమూయడంతో రాష్ట్రంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 29కి పెరిగింది.
కర్నూలులో ఆగమాగం..
ఏపీలో కరోనా మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా కొనసాగుతోన్న కర్నూలులో పరిస్థితి భయానకంగా తయారైంది. శుక్రవారం బయటపడ్డ 62 కొత్త కేసుల్లో గరిష్టంగా 27 కేసులు ఈ ఒక్క జిల్లాకు చెందినవే కావడం గుబులురేపుతున్నది. ఇక్కడ గడిచిన 5 రోజుల వ్యవధిలోనే 100కుపైగా కొత్త కేసులు రావడం గమనార్హం. టోటల్ గా జిల్లాలో కేసుల సంఖ్య 261కి పెరిగింది. ఇంకా విషాదమేంటంటే.. ఇక్కడ కేవలం 4మాత్రమే డిశ్చార్జికాగా, 249 కేసులూ యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. శుక్రవారం మరో మరణం సంభవించడంతో జిల్లాలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
కృష్ణా సెంచరీ.. గుంటూరు డబుల్..
ఏపీ అధికార యంత్రాంగం కొలువై ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి అదుపులోకి రాలేదు. శుక్రవారం వెలుగు చూసిన కొత్త కేసుల్లో సెకండ్ హయ్యెస్ట్ 14కేసులు కృష్ణాలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 102కు పెరిగాయి. 25 మంది డిశ్చార్జికాగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 70 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 11 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 206కు పెరిగింది. కర్నూలు జిల్లాతో సమానంగా ఇక్కడ కూడా ఎనిమిది మంది చనిపోయారు.
ఆ మూడు జిల్లాల్లోనే 60 శాతం..
ఏపీలో ఇప్పటిదాకా 955 కరోనా కేసులు రాగా, అందులో 60 శాతం కేసులు కేవలం మూడు జిల్లాల్లో నమోదైనవే. కర్నూలులో 261, గుంటూరు 206, కృష్ణా 102 కేసుల తర్వాత 73 కేసులతో చిత్తూరు నాలుగో స్థానానికి ఎగబాకింది. నెల్లూరులో 68, ప్రకాశం 53, కడప 51, అనంతపురం జిల్లాలో శుక్రవారం మరో వ్యక్తి చనిపోగా, 4కొత్త కేసులతో మొత్తం 46కు చేరింది. వెస్ట్ గోదావరి 39, ఈస్ట్ గోదావరి 34, విశాఖపట్నం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇప్పటికీ కరోనా ఫ్రీగానే కొనసాగుతున్నాయి.
Recommended Video
తగ్గని టెస్టుల జోరు..
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై పలు రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేయడంతో వాటి వాడకాన్ని రెండ్రోజులు నిలిపేసిన ఐసీఎంఆర్.. ఏపీ కొనుగోలు చేసిన కిట్స్ కు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టెస్టులు మళ్లీ జరందుకున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు టోటల్ గా 54,338 శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయంలో ఏపీ ఇప్పటికీ టాప్-10 రాష్ట్రాల్లోనే కొనసాగుతున్నది.