భర్తల హంతకులుగా భార్యలు-24 గంటల్లో ఇద్దరి ప్రాణం తీసేశారు..!
గతంలో భార్యల్ని హత్య చేసిన భర్తలు అనే వార్తలు అక్కడక్కడా కనిపించేవి. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. తేడా వస్తే భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏవైనా, సందర్భం ఏదైనా, సమయం, కాలం ఇలా దేనితోనూ సంబంధం లేకుండా భర్తల్ని భరించే స్థాయి దాటి వారిని చంపేసి అయినా తాము బతకాలనే ధోరణి భార్యల్లో కనిపిస్తోంది. దీంతో ఏపీ, కర్నాటకలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో ఇద్దరు భర్తలు తమ భార్యల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీలో పెద్దూరుకు చెందిన అరుణ పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అమరేంద్రబాబును తాజాగా హతమార్చింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా భర్తమద్యం సేవించి వచ్చి తనను వేధిస్తుండటం, తాజాగా జేబులో కత్తి పెట్టుకుని వచ్చి బెదిరించడంతో చంపేస్తాడనే భయంతో తానే ముందుగా కర్రతో తలపై కొట్టి ఆమె తన భర్తను అపస్మారక స్ధితిలోకి పంపింది. అక్కడితో ఆగకుండా తాడు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే తాడు మెడకు బిగించి చంపేసింది.

కర్నాటకలో జరిగిన మరో ఘటనలో బెలగావిలో తాను శారీరక సుఖం పంచలేదని, కూతురుపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడుతున్న భర్తను మరో మహిళ హతమార్చింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను తలపై బండరాయితో కొట్టి చంపేయడమే కాకుండా.. శవాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలో పారేసింది. సాక్ష్యాల్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అయినా చివరికి పోలీసుల దర్యాప్తులో పట్టుబడింది. దీంతో ఈ ఘటన కర్నాటక వ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ రెండు ఘటనల్లోనూ కామన్ పాయింట్ భర్తల్ని భరించలేని భార్యల దుస్థితే. భర్తను ఇప్పుడు చంపకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం వారిలో ఉంది. దీంతో ఆవేశం ఆపుకోలేక అత్యంత దారుణంగా ఇలా ఇద్దరు మహిళలు తమ భర్తల్ని హతమార్చారు. వారికి పోలీసులకు పట్టుబడతామన్న భయం కానీ, భవిష్యత్తుపై ఆందోళన కానీ లేదు. కేవలం తమను లేదా తమ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలనే తాపత్రయం కనిపించింది. అయితే చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.












Click it and Unblock the Notifications