భర్తామరిదిని కొట్టి నిర్బంధించి మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగర శివారులోని నారపల్లి అటవీ ప్రాంతంలో గిరిజన యువతి సోమవారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న ఆమెను బెదిరించి నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. పక్కనే ఉన్న భర్తను, మరిదిని కొట్టి నిర్బంధించిన దుండగులు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సిగ్గుమాలిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన మైసయ్య, అతని భార్య (20), తమ్ముడు తిరుపతి, మరి కొందరు జీవనోపాధి కోసం వారం క్రితం నగరానికి వచ్చారు. ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలో నివసిస్తున్న వీరు పరిచయమున్న శ్రీనివాస్ అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద పని కుదుర్చుకున్నారు.
తన వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న బాలస్వామికి వీరిని అప్పగించాడు. భువనగిరి ప్రాంతంలో ఉన్న జామతోటలో జరుగుతున్న మట్టిపనికి వెళ్లేందుకు సోమవారం రాత్రి బాలస్వామి ఏడుగురు కార్మికులతో ఉప్పల్ రింగ్రోడ్డుకు వచ్చారు. సూపర్వైజర్తో నల్గురు కార్మికులు ఆర్టీసీ బస్సులో వెళ్లిపోగా మైసయ్య, అతని భార్య, తమ్ముడు తిరుపతి సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30కు ప్యాగో ఆటోను మాట్లాడుకుని భువనగిరికి బయలుదేరారు.
వరంగల్ జాతీయ రహదారిలోని నారపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే టాటా ఏస్లో వచ్చిన ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వీరి ఆటోను అడ్డుకున్నారు. ఆటోడ్రైవర్ను బెదిరించి పంపించారు. భర్త మైసయ్య, మరిది తిరుపతిని కొట్టి ఆమెను పక్కనున్న నిర్మానుష్య ప్రాంతంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. భర్త, మరిదిని నిర్బంధించి చీకట్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
బాధితురాలు భర్త, మరిదితో మంగళవారం మేడిపల్లి పోలీసుస్టేషన్కు వచ్చి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ఆగంతకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రవికిరణ్రెడ్డి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు గోప్యంగా ఉంచారు.