నేనేవర్నో తెలుసా?: ఎస్సైతో రోడ్డుపై మహిళ హంగామా
వరంగల్: ఓ మహిళ రోడ్డుపై హల్చల్ చేసింది. తన కారునే ఆపుతారా? నేనెవరో తెలుసా? శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కోడల్ని అంటూ హంగామా సృష్టించింది. ఎస్సైవి, నీకెంత ధైర్యం, నీ అంతు తేలుస్తా, హోంమంత్రి తెలుసు తనకు తెలుసునంటూ వీరంగం సృష్టించింది. తాను తలుచుకుంటే ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించింది.
రసాభాసగా మారుతున్న సందర్భంలో పోలీసులు ఆమెను అక్కణ్ణుంచి పంపించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నివ్వెరపోయారట. సదరు మహిళకు, ఆమె చెప్పిన పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఆమె హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ముక్తల కళావతి అని నిర్ధారించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.
శుక్రవారం కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏడీగా పని చేస్తున్న రమేష్బాబు అనే వ్యక్తి ఇంటికి శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా వరంగల్ జిల్లా గణపురం మండలంలోని భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై ఎస్సై భూక్య రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా ఆమె కారును ఆపారు. ఆపడం ఆపడంతోనే కార్లో నుంచి కళావతి సెల్ఫోన్ పట్టుకొని హల్చల్ సృష్టించింది.
స్వామిగౌడ్ కోడల్ని, హోంమంత్రి మాకు బాగా తెలుసంటూ సెల్ఫోన్లో ఉన్న ఫొటోలను చూపిస్తూ ఎస్సైపై విరుచుకుపడింది. అనంతరం వాహన నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.