కండక్టర్ కళ్యాణి దారుణ హత్య: భర్తతో గొడవ తర్వాత మిస్సింగ్..
ఇటీవల రాఘవయ్య రెండో భార్య చనిపోయింది. ఆపై రాఘవయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్ లోని ఆర్టీసీ ఆసుపత్రిలో కళ్యాణి అతనికి చికిత్స చేయించింది.
గుంటూరు: భర్త వేరే పెళ్లి చేసుకుని తనను దూరం పెట్టినా.. ఆమె సహించింది. రెండో పెళ్లి చేసుకున్న భార్య మరణిస్తే.. తిరిగి తానే చేరదీసింది. అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించింది. ఇంత చేసినా.. సదరు భర్త మాత్రం ఆమె పట్ల కాలయముడి లాగే వ్యవహరించాడు. అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు.
గుంటూరు జిల్లాలోని బొంతపాడు సమీపంలో ఈ హత్యోదంతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంపత్నగర్కు చెందిన బద్రి రాఘవయ్యకు 20 ఏళ్ల క్రితం కళ్యాణి(43)తో వివాహమైంది. కళ్యాణి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. కొన్నేళ్ల క్రితం రాఘవయ్య మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కళ్యాణి-రాఘవయ్య మధ్య విభేదాలు తలెత్తుతూ వస్తున్నాయి.

ఇటీవల రాఘవయ్య రెండో భార్య చనిపోయింది. ఆపై రాఘవయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్ లోని ఆర్టీసీ ఆసుపత్రిలో కళ్యాణి అతనికి చికిత్స చేయించింది. చికిత్స అనంతరం సంపత్ నగర్ లోని ఇంటికి వెళ్లారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక.. మరోసారి కళ్యాణి-రాఘవయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అప్పటి నుంచి కళ్యాణి కనిపించకుండా పోయింది.
దీనిపై కుమారుడు శ్రీనివాస్(16) లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మంగళవారం ఉదయం బొంతపాడు శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు దాన్ని కళ్యాణి మృతదేహంగా గుర్తించారు. రాఘవయ్యే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications