తప్పుడు ధృవపత్రం కేసులో...కోవూరు సర్పంచ్ ఉమ అరెస్ట్,రిమాండ్
నెల్లూరు: తప్పుడు ధృవపత్రం సమర్పించిన కేసులో కోవూరు సర్పంచ్ కూట్ల ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆమె ఎస్టీగా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పోటీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అయితే ఉమ ఎస్టీ కాదంటూ పాలకవర్గం ఆమెపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించింది.
సర్పంచ్ ఎస్టీ కాదని, ఆమె తప్పుడు ధృవపత్రం సమర్పించిందని కోవూరు పాలకవర్గం చేసిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆమెపై విచారణకు కలెక్టర్ ను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపించి ఉమ ఎస్టీ కాదనే విషయాన్ని ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు గాను మహిళా సర్పంచ్ కూట్ల ఉమపై చర్యలు తీసుకోవాలని కోవూరు తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శీలం రామలింగేశ్వరరావు కూడా కూట్ల ఉమపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు ఈ ఆదేశాలను అలక్ష్యం చేసి కనీసం కూట్ల ఉమపై కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో ఈ విషయమై మీడియాలో వార్తలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.
విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కోవూరు సర్పంచ్ కూట్ల ఉమపై కేసు నమోదు చేయడమే కాకుండా శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కూట్ల ఉమకు కోవూరు అడిషనల్ జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ పెద ఖాసిమ్ మార్చి ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు.