పింఛన్ దారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
పింఛన్ ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పింఛన్లు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అని తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు ప్రతి నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని ఈ మేరకు స్పష్టం చేశారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని ఆదేశించారు.

అలాగే పెన్షన్ల పంపిణీ విధానంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, SEEEPC సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications